‘గడప’లో ఎమ్మెల్యేపై ప్రశ్నల వర్షం

ABN , First Publish Date - 2022-10-08T09:26:03+05:30 IST

‘గడప’లో ఎమ్మెల్యేపై ప్రశ్నల వర్షం

‘గడప’లో ఎమ్మెల్యేపై ప్రశ్నల వర్షం

నిలదీసిన ఇద్దరిపై కేసు నమోదు

లక్కవరపుకోట, అక్టోబరు 7: విజయనగరం జిల్లా చందులూరు గ్రామంలో శుక్రవారం జరిగిన ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. మంచినీరు అందడం లేదని, పారిశుధ్య పనులు జరగడం లేదని, రోడ్డు కూడా సరిగా లేదని రొంగలవీధి మహిళలు, యువకులు గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావును ప్రశ్నించారు. ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను ఇంతవరకు రెగ్యులర్‌ చేయలేదని ఒక యువకుడు ప్రశ్నించాడు. త్వరలోనే సమస్యలన్నీ పరిష్కరిస్తానని ఎమ్మెల్యే చెప్పారు. ఇంతలో అ గ్రామ ఎంపీటీసీ ఎడ్ల కిశోర్‌ జోక్యం చేసుకుని ఎమ్మెల్యేను ప్రశ్నించిన వారితో వాగ్వాదానికి దిగారు. ‘ప్రశ్నించేందుకు మీరెవరు?, ఇది మా ప్రభుత్వం, మాకు నచ్చిన పని చేస్తాం’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, ఎమ్మెల్యేని ప్రశ్నించినవారిలో రొంగలి బంగారయ్య, గోగాడ నాయుడు అనే ఇద్దరిపై పోలీసులు కేసు పెట్టారు. 


Updated Date - 2022-10-08T09:26:03+05:30 IST