సమీక్షిస్తారా.. మమ అనిపిస్తారా...!
ABN , First Publish Date - 2022-11-15T23:29:30+05:30 IST
జిల్లా స్థాయిలో కీలకమైన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం బుధవారం జరగనుంది. స్థానిక పాత జిల్లా పరిషత్ ప్రాంగణంలోని సమావేశపు హాలులో జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ అధ్యక్షతన ఉదయం పదిన్నర గంటలకు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ మేరకు సభ్యులకు, అధికారులకు సమాచారం వెళ్లింది. జిల్లాల విభజన జరిగినప్పటికీ జిల్లా పరిషత్లకు ఉమ్మడి జిల్లా ప్రాతిపదికనే కొనసాగిస్తున్నారు.
నేడు ఉమ్మడి జిల్లా జడ్పీ సర్వసభ్య సమావేశం
నిధుల కేటాయింపు లేకపోవడంతో పట్టించుకోని పాలకులు
ఎక్కడి సమస్యలు అక్కడే.. అజెండాలో పలు కీలక అంశాలు
వచ్చే ఏడాది బడ్జెట్ ప్రతిపాదన
ఒంగోలు, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి) : జిల్లా స్థాయిలో కీలకమైన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం బుధవారం జరగనుంది. స్థానిక పాత జిల్లా పరిషత్ ప్రాంగణంలోని సమావేశపు హాలులో జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ అధ్యక్షతన ఉదయం పదిన్నర గంటలకు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ మేరకు సభ్యులకు, అధికారులకు సమాచారం వెళ్లింది. జిల్లాల విభజన జరిగినప్పటికీ జిల్లా పరిషత్లకు ఉమ్మడి జిల్లా ప్రాతిపదికనే కొనసాగిస్తున్నారు. దీంతో పూర్వపు జిల్లా పరిధిలోని 12 మంది ఎమ్మెల్యేలు, 56 మంది జడ్పీటీసీలు, ఎంపీపీలు అలాగే ఉమ్మడి జిల్లాలో భాగస్వామ్యం ఉండే ఎంపీలు, ఎమ్మెల్యేలందరూ సమావే శానికి హాజరయ్యే అధికారం ఉంటుంది. అలాగే ప్రస్తుతం జిల్లాతో పాటు ఉమ్మడి జిల్లాలోని కొన్ని ప్రాంతాలు కలిసిన బాపట్ల, నెల్లూరు జిల్లా అధికారులు కూడా హాజరు కావాలి.
సీరియ్సగా తీసుకోని పాలకులు
వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఏర్పడిన ప్రస్తుత ఉమ్మడి జిల్లా పరిషత్లో చైర్పర్సన్తో సహా 57 మంది జడ్పీటీసీలు, ఎంపీపీలందరూ వైసీపీకి చెందిన వారే కాగా ఆపై స్థాయి ప్రజాప్రతినిధులలో కూడా అత్యధికులు అధికార పార్టీ వారే. అలా జడ్పీలో అధికార పార్టీ పెత్తనం పూర్తి స్థాయిలో ఉండటం, జడ్పీకి సంబంధించి పెద్దగా నిధుల కేటాయింపు అవకాశం లేకపోవడంతో కీలక ప్రజాప్రతినిధులు సమావేశాన్ని సీరియ్సగా తీసుకోవడం లేదు. ప్రతిపక్ష టీడీపీ సభ్యులు రావడం మానేయగా అఽధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా మొక్కుబడిగా వచ్చి వెళ్తున్నారు. దీంతో కీలక అధికారులు కూడా సమావేశాన్ని అంతగా పట్టించుకుంటున్న పరిస్థితిని కనిపించకపోతుండగా మండల స్థాయి ప్రజాప్రతినిధులు మాట్లాడే అంశాలకు పెద్దగా ప్రాధాన్యత లభించడం లేదు. అలా మొక్కుబడిగానే సమావేశాలు జరుగుతూ వస్తుండగా గత సమావేశం జూలై 24న జరిగింది. మరోవిడత సమావేశం బుధవారం జరగనుంది. పలు కీలక అంశాలనే ఈసారి అజెండాలో చేర్చారు. గత సమావేశాల మాదిరిగానే సమావేశాన్ని ముగిస్తారా, పూర్తి స్థాయిలో సమీక్షిస్తారా అనేది వేచి చూడాలి.
ప్రధానంగా వెలిగొండ ప్రాజెక్టు, ఎన్ఎ్సపీ ఆయకట్టు, విద్య, వైద్యం, డ్వామా గ్రామీణ నీటి సరఫరాలు, గృహనిర్మాణం, వ్యవసాయం, విద్యుత్, పంచాయతీరాజ్వంటి శాఖలతో పాటు వచ్చే ఏడాది(2023-24) బడ్జెట్ ప్రతిపాదనలు ఇందులో ఉన్నాయి. ఆయా అంశాలకు సంబంధించి జిల్లాలో పరిస్థితి పరిశీలిస్తే ఏ ఒక్కటి పురోగతి కనిపించడం లేదు. వెలిగొండ ప్రాజెక్టు వ్యవహారం ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వినాయకుని పెళ్లి రేపు అన్న చందంగా సాగుతోంది. నిర్వాసితుల పునరావాసం, పరిహారం చెల్లింపు అడుగుముందుకు పడకపోతుండగా నిర్మాణ పనులు, టన్నెల్ తవ్వకం పనులు మందకొడిగా సాగుతున్నాయి.
వరి సాగు తగ్గినప్పటికీ ఆయకట్టు రైతులకు నాట్లు సమయంలోనే నీటి ఎద్దడి ఏర్పడింది. వర్షాలు సమృద్ధిగా కురిసినప్పటికీ పాలకుల వైఫల్యం రైతులకు శాపంగా మారింది.
గృహ నిర్మాణం, గడప దాటడం లేదు. తొలిరోజుల్లో జిల్లాలో 67,699 ఇళ్లను మంజూరు చేయగా ఇప్పటి వరకు పట్టుమని పదిశాతం కూడా పూర్తి కాలేదు. కేవలం 5,174 మాత్రమే పూర్తయినట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తుండగా పంచాయతీరాజ్శాఖ పరిధిలో నిర్మిస్తున్న సచివాలయం, ఆర్బీకేలు, భవనాల పరిస్థితి అలాగే ఉంది. చాలా చోట్ల బిల్లులు రాక పనులు ముందుకు సాగడం లేదు.
విద్యాశాఖ వివాదాలమయంగా మారింది. నాడు-నేడు పనులు మందకొడిగా సాగుతున్నాయి.
జిల్లాలో వైద్యశాఖ పనితీరు అధ్వాన్నంగా ఉండగా సీజనల్ వ్యాధులు చుట్టేస్తున్నాయి.
డ్వామా పరిధిలో ఉపాధి పథకం లక్ష్యం మేర పనులు జరిగినట్లు లెక్కలు కనిపిస్తున్నా జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఆర్డబ్ల్యూఎస్ పరిధిలోని కీలకమైన జలజీవన్ పథకం పురోగతి ముందుకు సాగడం లేదు.
వ్యవసాయ రంగం పరిస్థితి చూస్తే ఖరీ్ఫలో సాధారణ విస్తీర్ణంలో పంటలు సాగైనా పత్తి, మిర్చి, వరి వంటి పైర్లపై పురుగులు, తెగుళ్ల దాడి ఉధృతంతో రై తులు ఆందోళన చెందుతున్నారు. రబీ సాగు జాప్యం అవుతోంది. వరిసాగు లాభదాయకంగా లేదని రైతులు విముఖుత చూ పుతుండగా ఇన్పుట్స్ సరఫరా ఆయా పంటల గిట్టుబాటు ధరల కల్పనలో ప్రభుత్వ పరంగా ఏ మాత్రం మద్దతు ధర లభించడం లేదు. గత ఏడాది పంటల భీమా పరిహారం అందజేతలో పెద్దఎత్తున ఆరోపణలు రాగా ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖాలాలు లేవు. అదే సమయంలో పాడిపరిశ్రమ ప్రతికూలంగా కనిపిస్తున్నది. తాజాగా పశువులకు లంపి వైరస్ బెడద వచ్చి పశుపోషకులు ఆందోళన చెందుతున్నారు.
విద్యుత్ రంగంలో సంస్కరణలపై ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఇలాంటి సమయంలో జడ్పీ సమావేశం బుధవారం జరగనుంది. గతంలో ప్రతిమూడు మాసాలకు ఒకసారి నిర్వహించే ఈ సమావేశాన్ని 90 పనిదినాల పేరుతో మూడున్నర నెలల తర్వాత నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలోనైనా ఆయా పథకాల అమలు తీరు, ప్రజల సమస్యలపై క్షేత్ర స్థాయిలో పరిస్థితులపై సమీక్షిస్తారా లేక మొక్కుబడిగానే ముగిస్తారా అన్నది చూడాల్సి ఉంది.