వైసీపీలో వేరుకుంపట్లు
ABN , First Publish Date - 2022-12-12T23:23:31+05:30 IST
సింగరాయకొండ వైసీపీలో వర్గవిభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. ఒంగోలు శాసనసభ్యుడు, వైసీపీ నెల్లూరు, కడప, తిరుపతి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలను నేతలు వేర్వేరుగా నిర్వహించడం చర్చనీయాంశమైంది
వేర్వేరుగా బాలినేని జన్మదిన వేడుకలు
సింగరాయకొండలో మరోసారి బయటపడ్డ వర్గవిభేదాలు
చర్చనీయాంశమైన నేతల తీరు
సింగరాయకొండ, డిసెంబరు 12 : సింగరాయకొండ వైసీపీలో వర్గవిభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. ఒంగోలు శాసనసభ్యుడు, వైసీపీ నెల్లూరు, కడప, తిరుపతి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలను నేతలు వేర్వేరుగా నిర్వహించడం చర్చనీయాంశమైంది. వైస్ ఎంపీపీ, ప్రస్తుతం వైసీపీలో కీలకనాయకుడుగా వ్యవహరిస్తున్న సామంతుల రవికుమార్రెడ్డి ఆధ్వర్యంలో కందుకూరు రోడ్డులో సోమవారం ఉదయం బాలినేని పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల వైసీపీలో అన్నీతానై వ్యవహరించే ఆ పార్టీ వైద్యవిభాగం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బత్తుల అశోక్కుమార్రెడ్డి, ఏఎంసీ చైర్మన్ రాపూరి ప్రభావతి, పార్టీ మండల అధ్యక్షుడు తాండ్ర రామ్మూర్తితోపాటు వైసీపీలో ముఖ్య నాయకులు చాలామంది గైర్హాజరయ్యారు. నామినేటేడ్ పదవుల్లో ఉన్నవారు సైతం దూరంగా ఉన్నారు. సాయంత్రం వైసీపీ పట్టణ నాయకుల ఆధ్వర్యంలో అంటూ డాక్టర్ శివరామిరెడ్డి ఆసుపత్రి (అశోక్కుమార్రెడ్డి ఆసుపత్రి) ప్రాంగణంలో బాలినేని జన్మదిన వేడుకలు నిర్వహించారు. డాక్టర్ అశోక్కుమార్రెడ్డి, ఏఎంసీ చైర్మన్ రాపూరి ప్రభావతి పాల్గొని కేక్ కట్ చేశారు. శ్రీశైలం ట్రస్ట్బోర్డు సభ్యుడు తన్నీరు ధర్మరాజు, మూలగుంటపాడు మాజీ సర్పంచ్ చుక్కా కిరణ్, బత్తుల అనుచరులు పాల్గొన్నారు. వైసీపీ మండల అధ్యక్ష పదవికోసం రవికుమార్రెడ్డి పోటీ పడుతున్నారు. ఈక్రమంలో ఆ పదవికి మరొకరి పేరును డాక్టర్ అశోక్కుమార్రెడ్డి ప్రతిపాదించారు. దీంతో ఇరువురి మధ్య భేదాభిప్రాయాలు చోటుచేసుకున్నాయి. అవి తారస్థాయికి చేరాయి. ఈనేపథ్యంలోనే మండలంలో విడివిడిగా బాలినేని జన్మదిన వేడుకలు నిర్వహించినట్లు చర్చ నడుస్తోంది. గత ఏడాది బాలినేని జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండలంలోని అన్ని గ్రామాల నుంచి పెద్దఎత్తున నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రస్తుతం వైసీపీలో జరుగుతున్న అంతర్గ కుమ్ములాటలు, వర్గపోరు కారణంగా సోమవారం వేడుకలకు ఎక్కువ మంది హాజరు కాకపోవడంతో పేలవంగా జరిగాయి. దీంతో వైసీపీ శ్రేణుల్లో నైరాశ్యం నెలకొంది.