జిల్లాపై అల్పపీడన ప్రభావం

ABN , First Publish Date - 2022-11-11T23:42:51+05:30 IST

జిల్లాపై అల్పపీడన ప్రభావం కనిపిస్తోంది. పలుప్రాంతాల్లో శుక్రవారం పగటిపూట మూడు నుంచి నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రతలు తగ్గడంతోపాటు వాతావరణం చల్లబడింది.

జిల్లాపై అల్పపీడన ప్రభావం

తగ్గిన ఉష్ణోగ్రతలు, పెరిగిన చలి

మంగు వాతావరణంతో రైతుల్లో ఆందోళన

నేడు వర్షాలు కురిసే అవకాశం

ఒంగోలు, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): జిల్లాపై అల్పపీడన ప్రభావం కనిపిస్తోంది. పలుప్రాంతాల్లో శుక్రవారం పగటిపూట మూడు నుంచి నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రతలు తగ్గడంతోపాటు వాతావరణం చల్లబడింది. అత్యధిక ప్రాంతాల్లో చలిగాలుల తీవ్రత పెరిగింది. శనివారం పలుచోట్ల జల్లులు పడే అవకాశం కనిపిస్తోంది. బంగాళాఖాతంలో ఉత్తర శ్రీలంక-దక్షిణ తమిళనాడు మధ్య ఏర్పడిన అల్పపీడనం బలపడటంతో వాతావరణంలో మార్పు వచ్చింది. ఇప్పటికే తమిళనాడులోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండగా ఆ ప్రభావం దక్షిణకోస్తా జిల్లాల్లో కూడా ఉంది. తదనుగుణంగా జిల్లాలో శుక్రవారం నుంచే వాతావరణం చల్లబడింది. వారంరోజులుగా ఒంగోలు ప్రాంతంలో పగటిపూట గరిష్ఠ ఉష్ణోగ్రత 32 డిగ్రీలు ఉంటుండగా శుక్రవారం 29.5 డిగ్రీలకు పడిపోయింది. శనివారం తెల్లవారుజాము నుంచి వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. కాగా అల్పపీడన ప్రభావంతో జిల్లాలో నెలకొన్న మంగువాతావరణంతో రైతుల్లో ఆందోళన కనిపిస్తోంది. ఇప్పటికే అధిక ప్రాంతాల్లో పైర్లపై తెగుళ్లు, పురుగుల దాడి తీవ్రంగా ఉండగా ప్రస్తుత వాతావరణంతో అవి మరింతగా పెరిగి పంటలు దెబ్బతింటాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.

Updated Date - 2022-11-11T23:42:55+05:30 IST