కదులుతున్న రైలు నుంచి దిగబోయి..

ABN , First Publish Date - 2022-09-24T06:15:19+05:30 IST

కదులుతున్న రైలు నుంచి దిగబోయిన వ్యక్తి ప్లాట్‌ఫాం, రైలు మధ్య ఇరుకొన్నాడు. ఆయన్ను ఆర్‌పీఎఫ్‌ సిబ్బంది చాకచక్యంగా బయటకు తీసి ప్రాణాలు కాపాడారు.

కదులుతున్న రైలు నుంచి దిగబోయి..
ట్రైన్‌, ఫ్లాట్‌ఫాంకు మధ్య ఇరుక్కున్న రవికుమార్‌ను రక్షిస్తున్న ఆర్‌పీఎఫ్‌ సిబ్బంది

ప్లాట్‌ఫాం మధ్యలో ఇరుక్కున్న  వ్యక్తి

చాకచక్యంగా బయటకు    తీసిన ఆర్‌పీఎఫ్‌ సిబ్బంది

గిద్దలూరు టౌన్‌, సెప్టెంబరు 23 : కదులుతున్న రైలు నుంచి దిగబోయిన వ్యక్తి ప్లాట్‌ఫాం, రైలు మధ్య ఇరుకొన్నాడు. ఆయన్ను ఆర్‌పీఎఫ్‌ సిబ్బంది చాకచక్యంగా బయటకు తీసి ప్రాణాలు కాపాడారు. ఈ సంఘటన శుక్రవారం ఉదయం గిద్దలూరు స్టేషన్‌లో చోటుచేసుకుంది. హుబ్లీ నుంచి విజయవాడ వెళుతున్న రైలులో రవికుమార్‌ అనే వ్యక్తి ప్రయాణిస్తున్నాడు. కర్ణాటకలోని గదక్‌ స్టేషన్‌లో ఎక్కిన ఆయన బేతంచెర్లలో దిగాల్సి ఉంది. నిద్రపోతున్న రవికుమార్‌ బేతంచెర్లలో దిగలేకపోయాడు. అప్పటికే రైలు గిద్దలూరు సమీపంలోకి వచ్చింది. దీంతో ఆందోళనకు గురైన రవికుమార్‌ కదులుతున్న రైల్లో నుంచి దిగేందుకు ప్రయత్నించాడు. రైలుకు, ఫ్లాట్‌ఫాంకు మధ్య ఇరుక్కుపోయాడు. అప్పటికే రైలు నెమ్మదిగా ఉండి ఆగిపోయింది. వెంటనే స్పందించిన ఆర్‌పీఎఫ్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ కేవీ.ఎస్‌.రావు, కానిస్టేబుల్‌ శేషయ్య అక్కడికి చేరుకుని ఫ్లాట్‌ఫాంను గడ్డపారతో కొంత తొలగించి రైలుకు మధ్య ఇరుక్కున్న రవికుమార్‌ను చాకచక్యంగా బయటకు తీశారు. గాయాలపాలైన రవికుమార్‌ను 108 వాహనంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం నంద్యాలకు తరలించారు. ఆయన గాయపడ్డ విషయాన్ని కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. 

Updated Date - 2022-09-24T06:15:19+05:30 IST