యథేచ్ఛగా మద్యం బెల్ట్‌షాపులు

ABN , First Publish Date - 2022-12-12T00:28:54+05:30 IST

మండలంలోని ప్రతి గ్రామంలో మద్యం గొలుసుదుకాణాలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి.

యథేచ్ఛగా మద్యం బెల్ట్‌షాపులు

తర్లుపాడు, డిసెంబరు 6: మండలంలోని ప్రతి గ్రామంలో మద్యం గొలుసుదుకాణాలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. ప్రతి గ్రామం లో మద్యం బెల్టు షాపులు నిర్వహిస్తున్నారు. సంబంధిత అధికారులు మాత్రం నెలవారీ మామూళ్ల మత్తులో మునిగి పోతున్నారు. దీంతో బెల్ట్‌షాపుల నిర్వాహకులు యేథేచ్ఛగా సొమ్ము చేసుకుంటున్నారు.

ప్రభుత్వ దుకాణాల నుంచి సరఫరా

ప్రభుత్వ దుకాణాలలో పనిచేస్తున్న సిబ్బంది క్వార్టర్‌ సీసాకు రూ.10 అదనంగా తీసుకొని వారికి కావాల్సినంత మద్యాన్ని బెల్టుషాపుల నిర్వాహకులకు ఇస్తున్నారు. ఒక్కొక్క క్వార్టర్‌ సీసాకు రూ.50 అదనంగా తీసుకొని విక్రయించి సొమ్ము చేసుకుంటు న్నారు. ప్రభుత్వ దుకాణాల పక్కనే రాత్రివేళల్లో, ఉదయం 10 గం. లోపు మద్యాన్ని విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. మండలంలో ఎక్కువగా తుమ్మలచెరువు, చెన్నారెడ్డిపల్లి, కలుజువ్వలపాడు, బుడ్డపల్లి, తాడివారిపల్లి, తర్లుపాడు, మీర్జపేట, గానుగ పెంట, నాగెళ్లముడుపు గ్రామాల్లో బెల్ట్‌ షాపులు ఎక్కువగా ఉన్నాయి. వీటి నిర్వాహ కులు తర్లుపాడు, కలుజువ్వలపాడు, మార్కా పురం ప్రభుత్వ మద్యం దుకాణాల నుంచి మద్యం తెచ్చుకుంటున్నట్లు సమాచారం. బెల్టుషాపులే కాకుండా రెస్టారెంట్లు, చిన్న చిన్న బడ్డీ బంకుల వద్ద విచ్చలవిడిగా మద్యాన్ని అమ్ముతూ కూర్చోబెట్టి తాగిస్తున్నారు. బెల్ట్‌ షాపు, రెస్టారెంట్‌ నిర్వాహకులు నెలవారీ ఎక్సైజ్‌, సెబ్‌ అధికారులకు మామూళ్లు ముట్టజెపుతూ యథేచ్ఛగా తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. ఇటీవల పొదలి సెబ్‌ అధికారులు మీర్జపేటలో నాటుసారా కాస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకొన్నారు. నువ్వు ఎక్కడ కొనుగోలు చేశావని ఒత్తిడి చేయడం తో తర్లుపాడులోని ఒక కిరాణా షాపు యజ మాని పేరు చెప్పారు. దీంతో ఆయన వద్దకు వచ్చి భారీ స్థాయిలో ముడుపులు తీసుకొని వెళ్లినట్లు సమాచారం. ఇలా తుమ్మల చెరువులో కూడా ఇద్దరు బెల్టుషాపుల నిర్వాహకుల వద్ద 50 కేసులు మద్యం ఉన్నట్లు సమాచారం ఇచ్చినప్పటికీ కమిషన్లకు కక్కుర్తి పడి సెబ్‌ అధికారులు అటువైపు చూసిన దాఖలాలు లేవు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి మండలంలో బెల్టు షాపులను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - 2022-12-12T00:28:58+05:30 IST