పొలం విక్రయ మోసం.. ఏడుగురిపై కేసు

ABN , First Publish Date - 2022-07-19T05:03:35+05:30 IST

పొలం విక్రయించడంలో మోసం చేయడంపై ఏడుగురు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

పొలం విక్రయ మోసం.. ఏడుగురిపై కేసు

దర్శి, జూలై 18 : పొలం విక్రయించడంలో మోసం చేయడంపై ఏడుగురు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం... నర్సరావుపేటకు చెందిన ఎన్‌ సరస్వతి, ఎన్‌ మల్లికార్జునరావు, ఎన్‌ శ్రీనివాసరావులకు దర్శి రెవెన్యూ గ్రామంలోని 1065/1, 1065/బి2 1065/బి2ఏలో రెండు ఎకరాలు, 1065/బి2 బి2బి రెండు ఎకరాలు, 1065/బి2 బి2సీలో 30 సెంట్లు, మరో 1.70 సెంట్లు కలిపి మొత్తం ఆరు ఎకరాల భూమి ఉంది. వారు ఆ భూమిని గుంటూరు జిల్లాకు చెందిన ఎం వీరశ్రీధర్‌రెడ్డికి 2020 జూలైలో విక్రయించే క్రమంలో అగ్రిమెంట్‌ రాశారు. అప్పటి నుంచి భూమిని వారికి రిజిస్టర్‌ చేయకుండా ఇబ్బంది పెడుతున్నారు. భూమి విక్రయంలో మధ్యవర్తిగా వ్యవహరించిన దర్శికి చెందిన సీహెచ్‌ సిద్ధయ్య, ఏ అస్సాన్‌ పేరుతో అందులో 4.30 ఎకరాల భూమిని నర్సరావుపేటకు చెందిన వ్యక్తులు జీపీ చేశారు. అనంతరం జీపీ చేయించుకున్న వ్యక్తులు తొలుత విక్రయించిన నర్సరావుపేటకు చెందిన వ్యక్తులు కుమ్మకై దర్శికి చెందిన దామెర్ల రమేష్‌ అనే వ్యక్తికి 4.40 ఎకరాల భూమిని కొద్దిరోజుల క్రితం దర్శి సబ్‌ రిజిస్టార్‌ కార్యాలయంలో రిజిస్టర్‌ చేశారు. విషయం తెలుసుకున్న బాధితుడు వీరశ్రీధర్‌రెడ్డి దర్శి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి పిర్యాదు మేరకు అక్రమంగా రిజిస్టర్‌ చేసిన సీహెచ్‌ సిద్ధయ్య, ఏ అస్సాన్‌, ఎన్‌ సరస్వతి, మల్లికార్జున, శ్రీనివాసరావు, రిజిస్టర్లు చేయించుకున్న దామెర్ల రమేష్‌, రిజిస్టర్‌ చేసిన సబ్‌రిజిస్ర్టార్‌పై కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై రాంబాబు తెలిపారు.

Updated Date - 2022-07-19T05:03:35+05:30 IST