స్త్రీనిధి రుణబకాయిల గోల్మాల్పై ధర్నా
ABN , First Publish Date - 2022-10-12T04:50:05+05:30 IST
ముండ్లమూరు, మండలంలోని వేముల పంచాయతీ పరిధిలోని కమ్మవారిపాలేనికి చెందిన నాలుగు పొదుపు సంఘాల గ్రూపు సభ్యులు 2019 అక్టోబరులో స్త్రీనిధి ద్వారా రూ.2 లక్షల చొప్పున రుణంగా తీసుకున్నారు.
పూర్తిగా చెల్లించినా బాకీ ఉన్నారంటున్న వైకేపీ సిబ్బంది
లబోదిబోమంటున్న పొదుపు గ్రూపు మహిళలు
ముండ్లమూరు, అక్టోబరు 11 : మండలంలోని వేముల పంచాయతీ పరిధిలోని కమ్మవారిపాలేనికి చెందిన నాలుగు పొదుపు సంఘాల గ్రూపు సభ్యులు 2019 అక్టోబరులో స్త్రీనిధి ద్వారా రూ.2 లక్షల చొప్పున రుణంగా తీసుకున్నారు. ఒక్కొక్క గ్రూపు రూ.2 లక్షలు, వడ్డీ రూ.30వేలు చెల్లించాల్సి ఉండగా అదనంగా రూ.17వేలు సైతం చెల్లించారు. ఇటీవల స్త్రీ నిధి మేనేజర్ ముండ్లమూరు మండలంలో స్త్రీనిధి పెండింగ్ బకాయిలపై దృష్టి సారించారు. ఈ క్రమంలో ఆ నాలుగు గ్రూపు సభ్యులను బకాయిలపై ప్రశ్నించగా గ్రామ యానిమేటర్ నాగినేని సుబ్బారావుకు చెల్లించామని వారు చెప్పారు. ఒక్కొక్క గ్రూపునకు రూ.60వేల వరకు బకాయి ఉన్నట్టు చెప్పటంతో వారంతా కంగుతిన్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం ధనలక్ష్మి, తిరుమల, శ్రీనివాస, వీరాంజనేయ, జీవ గ్రూపు సభ్యురాళ్లు స్థానిక వైకేపీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. మొత్తం నాలుగు గ్రూపులకు సంబంధించి రూ.3.50 లక్షల వరకు నిధులు గోల్మాల్ అయినట్టు సభ్యురాళ్లు తెలిపారు. ధనలక్ష్మి గ్రూపు అధ్యక్షురాలు గోరంట్ల నాసరమ్మతోపాటు నాగినేని మల్లేశ్వరి, నెలకుర్తి రామాంజమ్మ, దూళ్ల భాగ్యలక్ష్మి, బూచేపల్లి శివభాగ్యం, చంద్రగిరి ఈశ్వరమ్మ, గోళ్ల వెంకటరత్నం, కందిమళ్ల శ్రీలత, నాగేంద్రం, తిరుపతమ్మ, మరి కొంత మంది సభ్యులు ధర్నాలో పాల్గొన్నారు. ఈ నాలుగు గ్రూపులే కాకుండా ఇంకా పలు గ్రూపుల్లో నిధులు అక్రమాలు జరిగినట్టు సమాచారం. ఈ విషయమై ఏపీఎం హనుమంతరావును వివరణ కోరగా ఇటీవలే కొత్తగా వచ్చానని, పొదుపు సంఘాలను పిలిపించి విచారించి ఎవరు అక్రమాలకు పాల్పడ్డారో తేలుస్తామని చెప్పారు.