గడపగడపలో నిలదీత

ABN , First Publish Date - 2022-11-16T00:55:37+05:30 IST

‘సైడు కాలువలు లేవు. మురుగు రోడ్లపై ప్రవహిస్తున్నా పట్టించుకునే దిక్కులేదు. తాగునీటి సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. మూడేళ్లుగా కాలనీ వైపు కన్నెత్తిచూసిన వారు లేరు. ఒక్కో ఇంటిలో నాలుగు కుటుంబాలు ఉంటున్నా ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు’ అని వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి వరికూటి అశోక్‌బాబును పాత సింగరాయకొండ ఎస్సీ కాలనీవాసులు నిలదీశారు.

గడపగడపలో నిలదీత

అభివృద్ధిపై అశోక్‌బాబును ప్రశ్నించిన పాతసింగరాయకొండ ఎస్సీ కాలనీల వాసులు

సైడు కాలువలు, తాగునీటి సౌకర్యం కల్పించకపోవడంపై ఆగ్రహం

సింగరాయకొండ, నవంబరు 15: ‘సైడు కాలువలు లేవు. మురుగు రోడ్లపై ప్రవహిస్తున్నా పట్టించుకునే దిక్కులేదు. తాగునీటి సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. మూడేళ్లుగా కాలనీ వైపు కన్నెత్తిచూసిన వారు లేరు. ఒక్కో ఇంటిలో నాలుగు కుటుంబాలు ఉంటున్నా ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు’ అని వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి వరికూటి అశోక్‌బాబును పాత సింగరాయకొండ ఎస్సీ కాలనీవాసులు నిలదీశారు. ఒక్కో సమస్యను ఆయన దృష్టికి తీసుకు వచ్చి ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో అశోక్‌బాబుతోపాటు, పక్కన ఉన్న వైసీపీ నేతలు సమాధానం చెప్పలేక ఉక్కిరిబిక్కిరయ్యారు. పాతసింగరాయకొండలో మంగళవారం అశోక్‌బాబు గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. రెండు ఎస్సీ కాలనీల్లో పర్యటించారు. తొలుత అంబేడ్కర్‌ విగ్రహానికి అశోక్‌బాబు పూలమాలలు వేసి నివాళులర్పించే సమయంలో స్థానికులు అభివృద్ధి పనులపై ప్రశ్నించారు. మూడేళ్లుగా ఇబ్బందులు పడుతున్నా పట్టించుకునే వారు లేరని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల నుంచి వ్యతిరేకతను గమనించిన వైసీపీ నేతలు గడపగడపకు వస్తామని, సమస్యలు అక్కడ వింటామని కార్యక్రమాన్ని ప్రారంభించారు. తదనంతరం వరికూటి మరో ఎస్సీ కాలనీలో పర్యటించారు. అక్కడ కూడా ప్రజలు మౌలిక సదుపాయాలు లేకపోవడం, పథకాలు సక్రమంగా అందకపోవడంపై ఆయన్ను నిలదీశారు. కాలనీల్లో గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి అండగా నిలిచిన నేతలు కార్యక్రమంలో పాల్గొనకుండా ముఖం చాటేశారు. వైసీపీ జిల్లా వైద్యవిభాగం అధ్యక్షుడు బత్తుల అశోక్‌కుమార్‌రెడ్డి, ఎంపీపీ కట్టా శోభారాణి, వైస్‌ ఎంపీపీ సామంతుల రవికుమార్‌రెడ్డి, వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన చైర్మన్‌ పామర్తి మాధవరావు, యన్నాబత్తిన చిన్నా, సర్పంచ్‌ వల్లూరి రాజ్యలక్ష్మి, వైసీపీ నేతలు గాలి బుజ్జి, బాలాజీ పాల్గొన్నారు. గడపగడపకు కార్యక్రమంలో భాగంగా తొలుత వైసీపీ నేతలు నరసింహనగర్‌ నుంచి ర్యాలీగా వచ్చారు. అనంతరం మెట్లపై నుంచి వరాహ లక్ష్మీనరసింహస్వామికి దర్శించుకోవడానికి దేవస్థానానికి వెళ్లారు. వరికూటి, వైసీపీ నాయకులు పార్టీ కండువాలతోనే గుడిలోకి ప్రవేశించారు. దీనిపై భక్తుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Updated Date - 2022-11-16T00:55:39+05:30 IST