సమస్యలు పరిష్కరించాకే గ్రామానికి రండి!
ABN , First Publish Date - 2022-09-29T05:24:20+05:30 IST
గ్రామ సమస్య లు పరిష్కరించడంతోపాటు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చిన తర్వాతే గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించాలని వినోదరాయునివారిపాలెం గ్రామస్థులు స్పష్టం చేశారు.
అప్పటి వరకూ గడపగడపకు నిర్వహించొద్దు
వినోదరాయునిపాలెం గ్రామస్థుల తీర్మానం
నాగులుప్పలపాడు (ఒంగోలురూరల్) సెప్టెంబరు 28 : గ్రామ సమస్య లు పరిష్కరించడంతోపాటు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చిన తర్వాతే గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించాలని వినోదరాయునివారిపాలెం గ్రామస్థులు స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం రామాలయం వద్ద సమావేశమై తీర్మానించారు. ప్రకాశం పంతులు జన్మస్థలమైనప్పటికీ గ్రామంలో సచివాలయ భవన నిర్మాణానికి ఎలాంటి అనుమతులు ఇవ్వలేదన్నారు. గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరంలోని కనపర్తిలో సచివాలయం ఉండటంతో గ్రామాభివృద్ధి పూర్తిగా కుంటుపడుతుందన్నారు. సచివాలయం ఏర్పాటుకు అనేక అడ్డంకులు కావాలనే సృష్టిస్తున్నారన్నారు. స్థలదాతలు కూడా ముందుకొచ్చినా అధికారులు పట్టించుకోవడం లేదని తెలిపారు. జగనన్న కాలనీకి గ్రామంలో ఎలాంటి స్థలం కేటాయించకపోవడంతో పేదలు ప్రభుత్వం ఇచ్చే గృహ వసతి పొందలేకపోతున్నారని పేర్కొన్నారు. సమస్యలన్నీ పరిష్కరించిన తర్వాతే గ్రామంలో గడపగడపకు నిర్వహించాలని స్పష్టం చేశారు. ఈమేరకు తీర్మానాన్ని ఎంపీడీవోకు అందజేస్తామని తెలిపారు. కార్యక్ర మంలో సచివాలయ కార్యదర్శి కోడూరి శ్రీనివాసరావు, సర్పంచ్ ఘట్టంనేని అశోక్, బైరపనేని రాఘవయ్య, గంగా గోవిందు, పల్లిపాటి ఆదిశేషయ్య, బొమ్మిడి రాజారావు, పురం శ్రీనివాసరావు, నాయుడు ఏడుకొండలు, దారపునేని శింగయ్య, ఎరిచర్ల కోటేశ్వరమ్మ, వలంటీర్లు పాల్గొన్నారు.