యాప్ దోపిడీ!
ABN , First Publish Date - 2022-11-02T06:21:27+05:30 IST
ప్రజల ఆశలను కొందరు యాప్ నిర్వాహకులు భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. గతంలో ‘హిమ్’ సంస్థ ప్రజల నుంచి భారీగా వసూలు చేసి పారిపోగా,
నాడు హిమ్.. నేడు మెల్లాన్
జనాన్ని ముంచేసిన కేటుగాళ్లు
దొనకొండ/కురిచేడు, నవంబరు 1: ప్రజల ఆశలను కొందరు యాప్ నిర్వాహకులు భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. గతంలో ‘హిమ్’ సంస్థ ప్రజల నుంచి భారీగా వసూలు చేసి పారిపోగా, తాజాగా ప్రకాశం జిల్లాలో మెల్లాన్ ట్రస్ట్ సంస్థ.. ‘రోజువారీ నగదు’ పేరిట జనాలకు కుచ్చుటోపీ పెట్టింది. పెద్ద మొత్తంలో నగదు జమ అయ్యాక యాప్ను ఎత్తేసి ప్రజలను నిండా ముంచేసింది. దొనకొండ మండలంలో రెండు నెలల కిందట ‘మెల్లాన్ట్రస్ట్’ యాప్ మొదలైంది. రూ.1,500 కడితే రోజుకు రూ.75, రూ.3,000 కడితే రోజుకు రూ.150, రూ.5 వేలు కడితే రోజుకు రూ.250 చొప్పున ఖాతాల్లో జమ అవుతుందని యాప్లో ప్రకటించారు. మొదట ఈ యాప్ మాయలో పడిన ఎక్కువమంది పలు ప్రభుత్వ శాఖల ఉద్యోగులు కావడంతో వారి ద్వారా నిరుద్యోగులు, చిరు వ్యాపారులు, ఆటోడ్రైవర్లు సైతం ఎంతో ఆశతో యాప్లో చెల్లింపులు చేసినట్లు సమాచారం. ‘దీపావళి ధమాకా’ అంటూ రూ.5 వేలు కడితే రోజుకు రూ.500, రూ.45,000 కడితే ప్రతిరోజూ రూ.9 వేలు చెల్లిస్తామని ప్రకటించడంతో అక్టోబరులో ఈ సంఖ్య వేలకు చేరింది. దీపావళి నుంచి యాప్ పనిచేయడం లేదు. మోసపోయామని గుర్తించిన బాధితులు లబోదిబోమంటున్నారు.