ఉసురు తీసిన అప్పులు
ABN , First Publish Date - 2022-10-04T06:39:23+05:30 IST
అప్పుల బాధతో యువరైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన పుల్లలచెరువు మండలం గంగవరంలో సోమవారం చోటుచేసుకుంది.
గంగవరంలో యువ రైతు ఆత్మహత్య
పుల్లలచెరువు, అక్టోబరు 3 : అప్పుల బాధతో యువరైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన పుల్లలచెరువు మండలం గంగవరంలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గంగవరం గ్రామానికి చెందిన గదిబోయిన బాలచంద్రుడు (25)కు 0.67 ఎకరాల సొంత భూమి ఉంది. దానితోపాటు మరో రెండెకరాలు కౌలుకు తీసుకొని మూడేళ్లుగా మిర్చి, పత్తి సాగు చేస్తున్నాడు. ఏటా పంట చేతికి వచ్చే సమయంలో బోర్లలో నీరు రాక నష్టపోయాడు. అప్పులు రూ.10లక్షల వరకూ చేరాయి. వాటిని తీర్చేమార్గం కన్పించక కొద్దిరోజులుగా తీవ్ర మనోవేదనలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం తన పొలంలోనే పురుగుమందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. చుట్టుపక్కల రైతులు గమనించి ఆయన్ను ఎర్రగొండ పాలెం వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. బాల చంద్రుడికి భార్య అంజలి, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. ఎస్ఐ వేముల సుధాకర్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.