Petro Varsity: పెట్రో వర్సిటీకి రెక్కలు?

ABN , First Publish Date - 2022-12-12T04:36:48+05:30 IST

విభజన నేపథ్యంలో రాష్ట్రానికి కేటాయించిన అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం అండ్‌ ఎనర్జీ (ఐఐపీఈ) ఏపీలోని విశాఖపట్నం నుంచి వేరే రాష్ట్రానికి తరలిపోనుందా..?

Petro Varsity: పెట్రో వర్సిటీకి రెక్కలు?

ఏపీ చేజారనున్న మరో ప్రాజెక్టు!

రాయ్‌బరేలీకి తరలించేందుకు కేంద్రం ప్రతిపాదనలు

ఏడేళ్ల క్రితం రాష్ట్రానికి పెట్రో యూనివర్సిటీ మంజూరు

పెందుర్తిలో 200 ఎకరాల్లో శాశ్వత క్యాంపస్‌కు నిర్ణయం

40.8 ఎకరాలపై సమస్య.. పరిహారంపై వీడని పీటముడి

ప్రత్యామ్నాయమూ చూపని సర్కారు.. పునరాలోచనలో కేంద్రం

ఏపీ విభజన చట్టంలోని రైల్వేజోన్‌కు అతీగతీ లేదు

చేజారిన విశాఖ ఉక్కు.. ఇప్పుడు పెట్రో వర్సిటీకీ ముప్పు!

విభజన చట్టంలో పొందుపరిచిన మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు రాష్ట్రం దాటి పోయే ప్రమాదం కనిపిస్తోంది. ఏపీకి పెట్రో వర్సిటీని కేంద్రప్రభుత్వం మంజూరు చేసి ఏడేళ్లు! శాశ్వత క్యాంపస్‌ ఏర్పాటుకు సంబంధించిన భూసేకరణను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిచేయలేకపోయింది. పరిహారంపై పడిన పీటముడి మొత్తంగానే ఈ వర్సిటీని కష్టాల్లో పడేసింది. దీంతో, పెట్రో వర్సిటీని రాయ్‌బరేలీకి తరలించే యోచనలో కేంద్ర పెట్రోలియం శాఖ ఉంది. విభజన చట్టంలోని రైల్వేజోన్‌కు అతీగతీ లేదు. విశాఖ ఉక్కు ఇకపై ‘ఆంధ్రుల హక్కు’ ఎంత మాత్రమూ కాదని కేంద్రం తేల్చేసింది.

ఇప్పుడిక పెట్రో వర్సిటీనీ వెనక్కి తీసుకునే ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి.

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి) : విభజన నేపథ్యంలో రాష్ట్రానికి కేటాయించిన అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం అండ్‌ ఎనర్జీ (ఐఐపీఈ) ఏపీలోని విశాఖపట్నం నుంచి వేరే రాష్ట్రానికి తరలిపోనుందా..? ఆ దిశగా కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఆలోచన చేస్తోందా..? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది! పెట్రోలియం వర్సిటీని మంజూరు చేసి ఏళ్లు గడుస్తున్నా భూమి కేటాయింపు విషయంలోఎటూ తేల్చకపోవడంతో పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థ దేశంలో రెండే చోట్ల ఉంది. ఒకటి ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో ఉండగా.. రెండోదాన్ని విశాఖపట్నానికి కేటాయించారు. అయితే భూ సమస్య కారణంగా ఇది వెనక్కి వెళ్లిపోయే పరిస్థితి ఏర్పడడం ఆందోళన రేపుతోంది.

రాష్ట్ర విభజన తర్వాత అప్పటి కేంద్ర ప్రభుత్వం పలు కేంద్ర విద్యా సంస్థలను నూతన ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయాలని చట్టంలో పొందుపరిచింది. ఈ మేరకు 2015లో రాష్ట్రంలో ఐఐపీఈని ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. అయితే ఈ సంస్థ శాశ్వత క్యాంపస్‌ ఏర్పాటు చేసుకునేందుకు అవసరమైన స్థలాన్ని సేకరించే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించింది. దీంతో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం విశాఖ జిల్లా పెందుర్తి మండలం వంగలి గ్రామంలో సుమారు 201.8 ఎకరాల సేకరణకు సిద్ధమైంది. కొంత భూమిని సేకరించి 2016లోనే భూమి పూజ కూడా నిర్వహించింది. అయితే, శాశ్వత క్యాంపస్‌ అందుబాటులోకి వచ్చేంత వరకు తరగతులను ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్‌ కళాశాలకు చెందిన భవనంలో నిర్వహిస్తున్నారు. బీటెక్‌ కెమికల్‌ ఇంజనీరింగ్‌లో 60, పెట్రోలియం ఇంజనీరింగ్‌లో 60 సీట్లు ఉన్నాయి. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో మెరుగైన ర్యాంకు సాధించిన విద్యార్థులకు ఇందులో సీట్లు కేటాయిస్తారు.

నష్ట పరిహారం సరిపోదు..

రాష్ట్ర ప్రభుత్వం సేకరించదలచిన 201.8 ఎకరాల్లో 145 ఎకరాలకు రైతుల నుంచి ఎటువంటి ఇబ్బందీ ఎదురుకాలేదు. పట్టా ఉన్న రైతులకు ఎకరాకు రూ.15 లక్షలు, పట్టాలేని రైతులకు రూ.7 లక్షలు చొప్పున చెల్లించిన ప్రభుత్వం 145 ఎకరాలు సేకరించింది. మరో 15 ఎకరాలు ప్రభుత్వ ఆధీనంలోని పోరంబోకు కావడంతో మొత్తం 160 ఎకరాల సేకరణ ప్రక్రియ సజావుగానే సాగింది. అయితే, మరో 20 ఎకరాలకు సంబంధించి ప్రభు త్వం చెల్లిస్తానన్న నష్ట పరిహారం తీసుకునేందుకు రైతులు సుముఖంగానే ఉన్నప్పటికీ... కుటుంబ సభ్యుల్లో ఎవరికి ఇవ్వాలనే దానిపై గొడవలు రావడంతో వాళ్లు కోర్టును ఆశ్రయించారు. మరో 20 ఎకరాలకు సంబంధించి రైతులు ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారం సరిపోదంటూ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై కొన్నేళ్లుగా కేసు నడుస్తోంది.

వర్సిటీ అధికారుల లేఖ.. విలీనం దిశగా అడుగులు

ఏళ్లు గడుస్తున్నా ఈ భూ వ్యవహారం తేలకపోవడం, పైగా సమస్య మరింత జటిలమవుతుండడంతో పెట్రో వర్సిటీ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కొద్దిరోజుల కిందట లేఖ రాశారు. ప్రస్తుతం సేకరించిన భూమికి ప్రత్యామ్నాయంగా మరోచోట కేటాయించాలని కోరారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన రాలేదని తెలుస్తోంది. పెట్రో వర్సిటీ మంజూరై ఏడేళ్లు కావస్తున్నా భూ వివాదాన్ని తేల్చకపోవడం పట్ల కేంద్ర పెట్రోలియం మంత్రి, మంత్రిత్వశాఖ ఉన్నతాధికారులు అసహనం వ్యక్తం చేశారు. అందులో భాగంగానే వర్సిటీకి సంబంధించిన భూ వివాదాన్ని తేల్చకపోతే ఉత్తర ప్రదేశ్‌లోని రాయ్‌బరేలిలో ఉన్న యూనివర్సిటీలో విలీనం చేద్దామని ప్రతిపాదించినట్టు తెలిసింది. ఈ మేరకు వర్సిటీ అధికారులకు ఇప్పటికే సమాచారం అందింది.

దండిగా నిధులున్నాయి కానీ..

ఈ పెట్రో వర్సిటీ కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు రూ.1,055 కోట్లు కేటాయించింది. వీటిలో రూ.400 కోట్లు కాలేజీ నిర్వహణ కోసం కేటాయించింది. ఈ మొత్తానికి సంబంధించి వచ్చే వడ్డీతో సంస్థను నిర్వహించుకోవాల్సి ఉంటుంది. మిగిలిన రూ.655 కోట్లతో నిధులతో శాశ్వత క్యాంపస్‌ నిర్మాణాన్ని చేపట్టాల్సి ఉంటుంది. ఇప్పటికే శాశ్వత క్యాంపస్‌ నిర్మాణం కోసం మొదటి దశగా రూ.150 కోట్లు విడుదలై సిద్ధంగా ఉన్నాయి. వంగలిలో సేకరించిన భూమి చుట్టూ ప్రహరీ నిర్మాణానికి రూ.5 కోట్లు విడుదల చేశారు. ఈ ప్రహరీ నిర్మాణ బాధ్యతను ఏపీఐఐసీకి ఇచ్చింది. కానీ, నిర్మా ణం సగమే పూర్తయింది. ప్రతిష్ఠాత్మకమైన ఈ ప్రాజెక్టు వెళ్లిపోవడం మంచిది కాదని, రాష్ట్ర ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

వెనక్కి తగ్గిన ప్రభుత్వం..

ఈ కేసుపై కొన్నేళ్లుగా వాదనలు జరుగుతుండగా.. ఈ ఏడాది ఆగస్టులో కోర్టు ఒక తీర్పు ఇచ్చింది. దీని ప్రకారం ఎకరాకు రూ.13 లక్షలు లెక్కగట్టి, పట్టా ఉన్నట్టయితే రెండున్నర రెట్లు అంటే రూ.32.5 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. అలాగే, ఆర్‌ఆర్‌ ప్యాకేజీ కింద మరో రూ.5 లక్షలు చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతోపాటు చెట్లు, మోటార్‌ పంపులకు చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని చెప్పింది. అందుకు అనుగుణంగా ప్రభుత్వం హైకోర్టు రిజిస్ర్టార్‌కు రూ.6.39 కోట్లు డిపాజిట్‌ చేసింది. అయితే, పట్టాదారులతో సమానంగా తమకూ నష్టపరిహారం చెల్లించాలంటూ పట్టాలేని రైతులు హైకోర్టులో పిటిషన్‌ వేశారు. విచారణ చేపట్టిన సింగిల్‌ జడ్జితో కూడిన ధర్మాసనం పట్టాదారులకు ఇచ్చినట్టుగానే పట్టాలేని రైతులకూ ఇవ్వాలని, అందుకు అవసరమైన మొత్తాన్ని డిపాజిట్‌ చేయాలని సూచించింది. కోర్టు తుది తీర్పును అనుసరించి చెల్లింపులు ఉంటాయని పేర్కొంది. అయితే, పట్టాలేని రైతులకు అంత మొత్తంలో చెల్లిస్తే, రాష్ట్రవ్యాప్తంగా ఇలాగే చెల్లించాల్సి వస్తుందని, ఈ ఆదేశాలను నిలుపుదల చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం డివిజన్‌ బెంచ్‌కు వెళ్లింది. ప్రస్తుతం అక్కడ కేసు పెండింగ్‌లో ఉంది.

Updated Date - 2022-12-12T04:36:49+05:30 IST