విహార నౌకకు నో ఎంట్రీ

ABN , First Publish Date - 2022-06-11T08:08:07+05:30 IST

సాగర విహార నౌక ఎంవీ ఎంప్రెస్‌కు ఆదిలోనే అవాంతరం ఎదురైంది. ముందుగా అనుమతులు తీసుకోనందున ఈ నౌకను పుదుచ్చేరి..

విహార నౌకకు నో ఎంట్రీ

క్రూయిజ్‌ షిప్‌కు పుదుచ్చేరిలో చుక్కెదురు


విశాఖపట్నం, జూన్‌ 10(ఆంధ్రజ్యోతి): సాగర విహార నౌక ఎంవీ ఎంప్రెస్‌కు ఆదిలోనే అవాంతరం ఎదురైంది. ముందుగా అనుమతులు తీసుకోనందున ఈ నౌకను పుదుచ్చేరి పోర్టులోకి అనుమతించలేదు. కార్డోలియో క్రూయిజ్‌ లైన్స్‌కు చెందిన ఈ నౌకను ఈ నెల 6న తమిళనాడు సీఎం స్టాలిన్‌ చెన్నైలో జెండా ఊపి ప్రారంభించారు. ఈ నౌక చెన్నైలో బయల్దేరి విశాఖపట్నం, పుదుచ్చేరిల మీదుగా తిరిగి శనివారం నాటికి చెన్నై చేరుకోవాలి. షెడ్యూల్‌ ప్రకారం శుక్రవారం ఉదయం పుదుచ్చేరి వెళ్లాలి. అయితే ముందుగా ఎటువంటి అనుమతులు తీసుకోనుందున ఈ నౌకను పోర్టులోకి అనుమతించబోమని పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ స్పష్టం చేశారు.


క్రూయిజ్‌లో ఇతర రాష్ట్రాలకు చెందిన మద్యం, కేసినోలు ఉన్నందున, వాటికి కేంద్ర పాలిత ప్రాంతంలోకి అనుమతి లేదని, వెనక్కి వెళ్లిపోవాలని తెలిపారు. శుక్రవారం తెల్లవారుజామున నాలుగు గంటలకే పుదుచ్చేరి సముద్ర జలాల్లోకి ప్రవేశించిన క్రూయిజ్‌ అనుమతి కోసం ఎదురుచూసి ప్రయత్నాలు ఫలించక తమిళనాడుకు చెందిన కడలూరు పోర్టులో యాంకరింగ్‌ కోసం ప్రయత్నింది. అయితే షెడ్యూల్‌ ప్రకారం శనివారం ఉదయానికల్లా చెన్నై చేరాల్సి ఉండడంతో అటు నుంచి అటే బయలుదేరినట్టు విశాఖలోని ట్రావెల్స్‌ వర్గాలు తెలిపాయి.  పుదుచ్చేరి ప్రభుత్వం అనుమతి నిరాకరించడంతో, ఈ క్రూయిజ్‌ చెన్నై-విశాఖల మధ్యే నడిచే అవకాశం ఉందని పర్యాటక వర్గాలు చెబుతున్నాయి. ఇదిలావుండగా జూన్‌ నెలకు మాత్రమే క్రూయిజ్‌ను నడపాలని తొలుత భావించిన కార్డోలియా గ్రూపు ఇక్కడ పర్యాటకుల నుంచి వస్తున్న స్పందన చూసి సెప్టెంబరు 19 వరకు నడపడానికి ఏర్పాట్లు చేసుకొని టికెట్లు విక్రయిస్తోంది.

Updated Date - 2022-06-11T08:08:07+05:30 IST