మెగా దగా!.. నో డీఎస్సీ!

ABN , First Publish Date - 2022-06-12T08:15:37+05:30 IST

మెగా దగా!.. నో డీఎస్సీ!

మెగా దగా!.. నో డీఎస్సీ!

ఉపాధ్యాయులపై హేతుబద్ధీకరణ కత్తి!

రేషనలైజేషన్‌లో 4 వ్యూహాలు

ఖాళీ పోస్టుల భర్తీ ఇక లేనట్టే

ఉన్న టీచర్లతోనే సర్దుబాటు

మిగులు చూపించే పన్నాగం

హెడ్‌మాస్టర్‌, పీఈటీలూ తెరమరుగు

స్కూళ్లలో తెలుగు మీడియం ఎత్తివేత

60 మంది విద్యార్థులుంటేనే రెండో సెక్షన్‌

ప్రస్తుతం 5.. ఇకపై ఏడెనిమిది క్లాసులు

ఎన్నికలకు ముందు జగన్‌ డీఎస్సీ జపం

అధికారంలోకి వచ్చాక ఫుల్‌ రివర్స్‌

అంతిమంగా విద్యావ్యవస్థ అస్తవ్యస్తం


నాడు

వేల సంఖ్యలో టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మేం రాగానే మెగా డీఎస్సీ వేస్తాం - జగన్‌


నేడు

సర్కారు తాజా రేషనలైజేషన్‌ ఉత్తర్వులతో  ఖాళీ పోస్టులు మాయం. ఉన్న టీచర్లపై పని భారం.



(అమరావతి-ఆంధ్రజ్యోతి) 

ఎన్నికల ముందు ఒక మాట.. ఎన్నికల తర్వాత ఒక మాట. అన్న మాటను, ఇచ్చిన హామీని రివర్స్‌ చేసేందుకు.. అనేక ఎత్తుగడలు! ఎన్నికలకు ముందు ‘‘రాష్ట్రంలో వేల సంఖ్యలో ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మేం అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ వేస్తాం’’ అని ప్రతిపక్ష నేతగా జగన్‌ ప్రకటించారు. అప్పటికి రెండు డీఎస్సీలు వేసి.. దాదాపు 18వేల పోస్టులను చంద్రబాబు ప్రభుత్వం భర్తీచేశారు. ‘‘భర్తీ అంటే అలా కాదు...నేను చేసి చూపిస్తా. మెగా డీఎస్సీ వేస్తా’’ అని జగన్‌ ప్రకటించారు. మరి అధికారంలోకి వచ్చాక ఏం జరిగింది. మూడేళ్లయింది. ప్రభుత్వం ఒక్క డీఎస్సీని కూడా వేయలేదు. మరి ఖాళీగా ఉన్న 25 వేల పోస్టులను ఏం చేయాలి? అసలు ఖాళీలే లేవనేటట్లు చేస్తే!! ఇంకా మాట్లాడితే కొన్ని పోస్టులు మిగులు కూడా ఉన్నాయంటే.. చేసేదేముంటుంది.. సరిపెట్టుకోవడమే! రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ(రేషనలైజేషన్‌)కు ఇచ్చిన ఉత్తర్వుల వెనక పోస్టుల తగ్గింపు, ఇక పోస్టులు భర్తీ చేయకుండా చేయడం ప్రధానంగా కనిపిస్తోంది. ఉన్న ఉపాధ్యాయులపైనే మోయలేని భారం వేయడం తప్ప మరొకటి కనిపించడం లేదనే వాదన వినిపిస్తోంది. ప్రభుత్వ నిర్ణయాలు విద్యావ్యవస్థను అస్తవ్యస్తం చేసేలా ఉన్నాయని పలువురు విద్యా నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


చతుర్ముఖ మోసం ఇదే!

ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేయాల్సిన అవసరం లేకుండా చేసేందుకు.. ఉన్న ఉపాధ్యాయ ఖాళీలను లేవని చూపించేందుకు నాలుగు వ్యూహాలను ప్రభుత్వం ఎంచుకుంది. 

ఒకటి: మూడో తరగతి నుంచి 8వ తరగతి వరకు ఒకే ఒక్క మీడియం. అది కూడా ఆంగ్లమే. రెండు మీడియంలు ఉంటే రెండు సెక్షన్లు ఉండాలి. రెండు సెక్షన్లు అంటే ఆ సంఖ్యలో ఉపాధ్యాయులుండాలి. తెలుగు మీడియం ఎత్తేస్తే.. ఒక జట్టు ఉపాధ్యాయులే సరిపోతారు. దీంతో ఉపాధ్యాయుల అవసరం తగ్గిపోతుంది. 

రెండు: 9, 10 తరగతులకు మాత్రం తెలుగు, ఇంగ్లీషు రెండు మీడియంలు ఉంటాయని చెప్పింది. కానీ, ఇక్కడా మెలికపెట్టింది. ఒక్కో మీడియంకు సంబంధించిన సెక్షన్‌లో కనీసం 20 మంది విద్యార్థులుండాలని పేర్కొంది. ఉదాహరణకు ఒక పాఠశాలల్లో 10వ తరగతిలో తెలుగు మీడియం చదివే విద్యార్థులు 20మంది, ఇంగ్లీషు మీడియం చదివేవాళ్లు 40 మంది ఉంటే, అప్పుడు రెండు మీడియంలకు.. ఉపాధ్యాయులను ఇస్తారు. అలా కాకుండా తెలుగుమీడియం చదివేవారు 18 మందే ఉండి.. ఇంగ్లీషు మీడియంలో 40 మంది ఉంటే.. అప్పుడిక తెలుగుమీడియం సెక్షన్‌కు ప్రత్యేకంగా ఉపాధ్యాయులను ఇవ్వరు. ఇంగ్లీషు మీడియం సెక్షన్‌కు చెప్పేవాళ్లే తెలుగుమీడియంకు చెప్పాల్సి ఉంటుంది. ఇక, ప్రభుత్వం విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తిని 1:30గా పేర్కొంది. కానీ, సెక్షన్ల మాయాజాలంతో దీన్ని అమలుకానివ్వకుండా షరతులు పెట్టారు. ఉదాహరణకు 9, 10 తరగతులకు సంబంధించి.. ఏ తరగతిలో అయినా చేరిన విద్యార్థుల సంఖ్య 60కి మించితేనే రెండో సెక్షన్‌ ఏర్పాటు చేస్తారు. 60లోపు ఉంటే ఒకే సెక్షన్‌ ఉంటుంది. మరి 60మందిని ఒకే సెక్షన్‌లో పెట్టేటప్పుడు ఇక 1:30 నిష్పత్తి ఎక్కడ అమలయినట్లు? ఉపాధ్యాయుల అవసరం తగ్గించేందుకే ఈ పద్ధతి పెట్టారన్న విమర్శలున్నాయి. 

మూడు: ప్రధానోపాధ్యాయులను తీసేయడం. 3-8తరగతుల వరకు ఉండే పాఠశాలలకు ప్రధానోపాధ్యాయులే ఉండరు. ఇప్పటివరకు ఉన్న ప్రధానోపాధ్యాయులను తీసేస్తారు. అంతేకాకుండా 137 మంది కంటే విద్యార్థుల సంఖ్య తక్కువుగా ఉన్న హైస్కూల్స్‌లో ప్రధానోపాధ్యాయుడు ఉండరు. అంతేకాదు, పీఈటీ కూడా ఉండరు. 92 మంది కంటే విద్యార్థుల సంఖ్య తక్కువున్న ఉన్నత పాఠశాలల్లో(6-10 తరగతులు) కూడా ప్రధానోపాధ్యాయులు, పీఈటీ పోస్టులు ఉండవు. అంటే ఇప్పటివరకు రాష్ట్రంలో ఉన్న పాఠశాలల్లో సుమారు ఒక వెయ్యి పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు, పీఈటీలు లేరనుకుందాం. ఆ మేరకు పోస్టులు భర్తీ చేయకపోవడంతో అక్కడ ఖాళీలున్నాయి. కానీ, ఇప్పుడు ఏకంగా వేల పాఠశాలల్లో హెచ్‌ఎంలు, పీఈటీల పోస్టులే అవసరం లేదంటున్నారు. అంటే వెయ్యిమందిని భర్తీ చేయడం కాదు. కొన్నివేలమంది ప్రధానోపాధ్యాయులు, పీఈటీలు మిగిలిపోయారని చెప్పవచ్చు. 

నాలుగు: ప్రాథమిక పాఠశాలలను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయడం. ఇలా విలీనం చేయడం వల్ల పెద్దఎత్తున ఉపాధ్యాయుల అవసరం తగ్గుతుంది. ప్రాథమిక పాఠశాలలు ఏకోపాధ్యాయంగా మిగిలిపోతాయి. 1, 2 తరగతులకు సంబంధించి ఒకరే ఉపాధ్యాయుడు, ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఒక ఉపాధ్యాయుడు ఉండే పరిస్థితులను తీసుకొచ్చారు. ఈ వ్యూహాలతో ప్రభుత్వం ఉపాధ్యాయ పోస్టులనే తగ్గించేసింది. ఉపాధ్యాయ పోస్టులను భర్తీచేసి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు దారులు వేయాల్సిన ప్రభుత్వం.. అసలు ఉద్యోగాలే అక్కర్లేకుండా చేసి, ఉన్నవారిని సర్దేసి, వారిపై మోయలేని భారం వేసి విద్యాబోధన నాణ్యతను దెబ్బతీస్తోందనే విమర్శలు పెద్దఎత్తున వస్తున్నాయి. 

ఇనుప కండలు కష్టమే!

విద్యార్థి దశలో వ్యాయామానికి ప్రాధాన్యం ఇవ్వాలని మహాత్మాగాంధీ చెప్పారు. ఇనుప కండలు ఉక్కు నరాలతో విద్యార్థులు అభివృద్ధి చెందితే.. దేశం ఆరోగ్యంగా ఉంటుందని ఆకాంక్షించారు. అయితే, సర్కారు తీసుకున్న నిర్ణయంతో విద్యార్థుల భౌతిక ఆరోగ్యంపై ప్రభావం పడుతుందనే వాదన వినిపిస్తోంది. ప్రభుత్వం ప్రధానోపాధ్యాయులు, పీఈటీలను తీసివేయడం వల్ల విద్యార్థుల చదువులు, ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. ప్రభుత్వ నిర్ణయంతో వేల కొద్దీ పాఠశాలల్లో ఇకపై పీఈటీలు ఉండరు. మరి ఆయా పాఠశాలల్లోని విద్యార్థులకు ఇక క్రీడలు అక్కర్లేదా? వారు చక్కని ఆరోగ్యంతో ఎదగ డం అవసరం లేదా? అన్నదానికి ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. 


పర్యవేక్షించేవారేరీ?!

ప్రధానోపాధ్యాయుడు ఉంటే.. తన పాఠశాలలోని విద్యార్థుల చదువుల తీరును, ఉపాధ్యాయుల బోధనతీరు, సమర్థత, పనితీరులను మదింపు చేసి.. దానికి అనుగుణంగా ఎలా వ్యవహరించాలన్నది నిర్ణయిస్తారు. కొందరు విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నా, లేకుంటే ఫలానా ఉపాధ్యాయుడి పనితీరు మెరుగుపడాలన్నా చెప్పాల్సింది ఆయనే. ఇప్పుడు వాళ్లనే తీసేస్తే.. ఈ పనులెవరు చేస్తారు. అదేవిధంగా యాప్‌లు, మరుగుదొడ్ల శుభ్రత, మధ్యాహ్న భోజనం తదితర కార్యక్రమాలను కూడా ఆయనే పర్యవేక్షించేవారు. ఇప్పుడు ఈ భారం కూడా ఉపాధ్యాయులపైనే పడుతుంది. ప్రధానోపాధ్యాయుడిని తీసేసి.. ఉన్న ఉపాధ్యాయుల్లో ఒకరిని హెచ్‌ఎంగా వ్యవహరించాలంటూ ప్రభుత్వం జారీచేసిన హేతుబద్ధీకరణ ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే, సమాన క్యాడర్‌లో ఉన్న ఒకరిని మిగిలినవారికంటే పైన ఉన్న ప్రధానోపాధ్యాయుడి క్యాడర్‌లో కూర్చోబెట్టినా.. సమన్వయం ఒట్టిమాటే అవుతుంది. 


సుప్రీంలో కేసున్నా ఉత్తర్వులా?

తెలుగు మీడియంను రాష్ట్ర ప్రభుత్వం ఎత్తేయడంపై హైకోర్టులో పిల్‌ దాఖలైంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉత్తర్వులను పక్కనపెడుతూ హైకోర్టు తీర్పు చెప్పింది. దీనిపై ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఈ కేసు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది. అయినప్పటికీ ప్రభుత్వం జారీచేసిన 117జీవోలో.. 3 నుంచి 8వ తరగతుల వరకు కేవలం ఇంగ్లీషు మీడియం మాత్రమే ఉంటుందని చెప్పేసింది. అంటే ఈ తరగతులకు ఇక తెలుగు మీడియం ఉండదు. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్‌లో ఉండగానే ఇచ్చిన ఇలాంటి ఉత్తర్వులకు చట్టబద్ధత ఎంతవరకు ఉంటుంది? ఎవరైనా దీనిపై కోర్టుకు వెళ్తే నిలబడుతుందా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.


జీవో సవరించాల్సిందే

ఎమ్మెల్సీ కత్తి 

ఉపాధ్యాయుల రేషనలైజేషన్‌ కోసం జారీ చేసిన 117 జీవోను సవరించాలని ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ జీవో వల్ల వేలాది స్కూళ్లు ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మారతాయని, పలు ఉన్నత పాఠశాలల్లో హెడ్‌మాస్టర్‌ పోస్టులు రద్దవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం దీనిపైపై ఉపాధ్యాయ సంఘాలు, ఎమ్మెల్సీలు, అధికారులతో కూడిన 10మందితో కమిటీ వేసి ఆ సిఫారసులకు అనుగుణంగా జీవో 29 విడుదల చేసిందని గుర్తుచేశారు. అమల్లో ఉన్న జీవోను పక్కన పెట్టి ఎవరితోను చర్చించకుండా, అభిప్రాయాలు స్వీకరించకుండా 117 జీవో విడుదల చేయడం సరికాదన్నారు.

Updated Date - 2022-06-12T08:15:37+05:30 IST