నిత్య విద్యార్థి.. వయసు 70
ABN , First Publish Date - 2022-08-21T08:14:18+05:30 IST
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం(ఏఎన్యూ) స్నాతకోత్సవంలో ఏడు పదుల వయసున్న నిత్య విద్యార్థి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
- న్యాయశాస్త్రంలో రెండు స్వర్ణ పతకాలు
- ఏఎన్యూలో మెరిసిన డాక్టర్ కర్రి రామారెడ్డి
విజయవాడ, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం(ఏఎన్యూ) స్నాతకోత్సవంలో ఏడు పదుల వయసున్న నిత్య విద్యార్థి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మాస్టర్ ఆఫ్ లా(ఎల్ఎల్ఎం- దూర విద్య)లో అన్ని సబ్జెక్టుల్లో టాపర్గా నిలిచి యాకసిరి రాజా హరగోపాల్రెడ్డి-విజయలక్ష్మి స్వర్ణపతకంతోపాటు, జూరిస్ర్పుడెన్స్ అనే సబ్జెక్టులో టాపర్గా నిలిచిన కూర్మాల రామచంద్రరావు స్వర్ణపతకాన్ని కూడా ఆయన సొంతం చేసుకున్నారు. ఈ వయసులో ఆయన చూపిన ప్రతిభకు స్నాతకోత్సవానికి హాజరైన వారంతా చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు. ఆయనే రాజమహేంద్రవరానికి చెందిన ప్రముఖ మానసిక వైద్య నిపుణుడు డాక్టర్ కర్రి రామారెడ్డి. గతేడాది కూడా లేబర్ లాస్లో ఎల్ఎల్ఎం చేసి ఆయన స్వర్ణపతకం సాధించారు. ఇప్పటి వరకు న్యాయశాస్త్రంలో ఆయన ఐదు ఎల్ఎల్ఎంలు చేశారు. వృత్తి రీత్యా వైద్యుడైన ఆయన చదవడమే హాబీగా ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, లిటరేచర్, జర్నలిజం, కామర్స్, సోషల్ వర్క్, యోగా తదితర విభాగాల్లో డిగ్రీలను ప్రథమశ్రేణి మార్కులతో పూర్తి చేసి ప్రపంచ రికార్డు సాధించారు.