మునిసిపల్ వర్కర్స్ యూనియన్కు నూతన కార్యవర్గం
ABN , First Publish Date - 2022-12-10T02:34:09+05:30 IST
ఏపీ మునిసిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆసుల రంగనాయకులు ఎన్నికయ్యారు. ఏపీ మునిసిపల్ వర్కర్స్ యూనియన్ 4వ రాష్ట్ర మహాసభలు నవంబరు 7, 8 తేదీలలో ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగాయి.
విజయవాడ, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): ఏపీ మునిసిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆసుల రంగనాయకులు ఎన్నికయ్యారు. ఏపీ మునిసిపల్ వర్కర్స్ యూనియన్ 4వ రాష్ట్ర మహాసభలు నవంబరు 7, 8 తేదీలలో ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగాయి. ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీకి పలువురి పేర్లను పరిశీలనలోకి తీసుకున్నారు. ఈ మేరకు శుక్రవారం విజయవాడలో నూతన కమిటీ వివరాలను ఏఐటీయూసీ ప్రకటించింది. ఏపీ మునిసిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆసుల రంగనాయకులు ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పి.సుబ్బారాయుడు, ఉప ప్రధాన కార్యదర్శిగా బందెల రవికుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్గా కె.దుర్గలతో పాటు మొత్తం 25 మందితో నూతన కమిటీ ఎన్నికైంది. ఈ సందర్భంగా రంగనాయకులు మాట్లాడుతూ.. అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ను తక్షణం రద్దుచేసి కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మునిసిపల్ కార్మికులకు వారాంతపు సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పారిశుధ్య కార్మికులకు కనీస వేతనం రూ.25 వేలు ఇవ్వాలని, స్వచ్చాంధ్ర కార్పొరేషన్ డ్రైవర్లకు రూ.18,500 ఇవ్వాలని కోరారు.