వైఎస్సార్ చేయూత మహిళలకు భరోసా
ABN , First Publish Date - 2022-09-30T05:19:59+05:30 IST
నవరత్నాల్లో భాగంగా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి 45ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళల కోసం చేపట్టిన వైఎస్సార్ చేయూత పథకం మహిళల జీవనోపాధికి భరోసా కల్పిస్తుందని ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్రెడ్డి తెలిపారు.
ఎమ్మెల్యే విక్రమ్రెడ్డి
సంగం, సెప్టెంబరు 29: నవరత్నాల్లో భాగంగా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి 45ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళల కోసం చేపట్టిన వైఎస్సార్ చేయూత పథకం మహిళల జీవనోపాధికి భరోసా కల్పిస్తుందని ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్రెడ్డి తెలిపారు. గురువారం స్థానిక టీడీఆర్ కల్యాణ మండపానికి వచ్చిన ఎమ్మెల్యేకు మహిళలు పూలతో స్వాగతం పలికారు. అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ను పరిశీలించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ చేయూతతో మహిళలు కుటుంబ ఆదాయాన్ని పెంచుకునేందుకు ఆర్థికంగా ఉపయోగపడుతుందన్నారు. వైఎస్సార్ చేయూత కింద రూ.5.45 కోట్ల నమూనా చెక్కును మహిళలకు అందచేశారు. కార్యక్రమంలో ఎంపీపీ పద్మావతమ్మ, ఎంపీడీవో గోపీ, తహసీల్దారు జయవర్థన్, ఏపీఎం విజయలక్ష్మి, మండల కన్వీనర్ పులగం శంకర్రెడ్డి, పీఏసీఎస్ అధ్యక్షుడు పి శివకుమార్రెడ్డి, మాజీ కన్వీనర్ కె రఘునాథ్రెడ్డి, సర్పంచ్లు ఆనం ప్రసాద్రెడ్డి, బాలకృష్ణారెడ్డి, రమణమ్మ, పణీంధర్రెడ్డి, చందు, ఎంపీటీసీలు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.
వంగల్లులో ‘గడప గడపకు మన ప్రభుత్వం’
సంగం: మండలంలోని వంగల్లు సచివాలయం పరిధిలోని వంగల్లు, జంగాలకండ్రిక గ్రామాల్లో ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్రెడ్డి గురువారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి నాలుగు బృందాలుగా ఏర్పడి కార్యక్రమం నిర్వహించారు. అందులో భాగంగా ఎమ్మెల్యే విక్రమ్రెడ్డి జంగాలకండ్రికలో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం సరఫరా చేసిన పథకాల ద్వారా లబ్ధి పొందిన వ్యక్తిగత కరపత్రాలను పంపిణీ చేశారు. మిగతా అధికారులు, ప్రజాప్రతినిధులు మూడు బృందాలుగా వంగల్లులో గడప గడప కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేతోపాటు సర్పంచులు, స్థానిక నాయకులు గంగపట్నం శేఖరయ్య, మోహన్రెడ్డి, రఘురామయ్య, పులగం శంకర్రెడ్డి, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, అధికారులు పాల్గొన్నారు.