Nellore Dist.: ఇంకా లభ్యంకాని మహిళా ఆచూకీ..

ABN , First Publish Date - 2022-12-12T10:58:42+05:30 IST

నెల్లూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. తుపాను ప్రభావంతో ఉధృతంగా ప్రవహిస్తున్న వేగూరు కాలువలో పూల బుజ్జమ్మ(65) అనే మహిళ గల్లంతైంది.

Nellore Dist.: ఇంకా లభ్యంకాని మహిళా ఆచూకీ..

నె

ల్లూరు: జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. తుపాను ప్రభావంతో ఉధృతంగా ప్రవహిస్తున్న వేగూరు కాలువలో కోవూరు మండలం, రామనాథపురం కాలనీకి చెందిన పూల బుజ్జమ్మ(65) అనే మహిళ గల్లంతైంది. సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. ఇంకా మహిళా ఆచూకి లభ్యంకాలేదు. భారీ వర్షం కురుస్తుండడంతో గాలింపు చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. ఈ ఘటన ఆదివారం రాత్రి జరిగింది.

తుపాను కారణంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం కూడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడుతున్నాయి. ఈ క్రమంలో వాగులు, వంకలు, కాలువలు పొంగి ప్రవహిస్తున్నాయి. మరికొన్ని చెరువులు అలుగులు పారుతున్నాయి. చాలా గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకుని రాకపోకలు నిలిచిపోయాయి.

కొరిమెర్ల ఉత్తర చెరువు, దువ్వూరు చెరువు, వంగల్లు చెరువులు నిండి కలుజులు ప్రవహిస్తున్నాయి. కొరిమెర్ల చాకలివాని చెరువు, చెన్నవరపాడు, జంగాలకండ్రిక, నీలాయపాళెం, జంగాలదొరువు చెరువులు నిండాయి. ఒక సంగం ఎర్రచెరువు మాత్రం 50 శాతం నిండింది. అలాగే మండల పరిధిలోని అన్నారెడ్డిపాళెం ఉన్నత పాఠశాలలో మోకాళ్ల లోతు వర్షపు నీరు చేరాయి. పాఠశాలకు పడమర వైపు పొలాల్లోని వర్షపు నీరంతా పాఠశాల ప్రాంగణంలోకి వచ్చి చేరాయి. దీంతో పాఠశాలకు ఎగువన ఉన్న బీసీ కాలనీ ఇళ్ల చుట్టూ నీళ్లు చేరాయి.

Updated Date - 2022-12-12T10:58:45+05:30 IST