వెంకయ్య ఓ రోల్‌ మోడల్‌

ABN , First Publish Date - 2022-10-04T05:36:57+05:30 IST

మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు బీజేపీ కార్యకర్తలకు ఓ రోల్‌ మోడల్‌ అని లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా కొనియాడారు.

వెంకయ్య ఓ రోల్‌ మోడల్‌
నెల్లూరు : ఆత్మీయ అభినందన సభలో వెంకయ్యనాయుడుకు జ్ఞాపిక అందజేస్తున్న ఓంబిర్లా, వీపీఆర్‌ తదితరులు

ఆయన సలహాలు, సూచనలు మరువలేను

స్వర్ణభారత ట్రస్ట్‌లో లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా 


వెంకటాచలం, అక్టోబరు 3 : మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు బీజేపీ కార్యకర్తలకు ఓ రోల్‌ మోడల్‌ అని లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా కొనియాడారు.  వెంకటాచలంలోని స్వర్ణభారత ట్రస్ట్‌లో సోమవారం జరిగిన దసరా వేడుక - ప్రతిభకు పురస్కారం కార్యక్రమంలో వెంకయ్య నాయుడుతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓంబిర్లా మాట్లాడుతూ దశాబ్దాలుగా వేలాది మంది పార్టీ కార్యకర్తల జీవితాలను ప్రభావితం చేసి, వారిని రాజకీయాల్లో ఉన్నత విలువలు కలిగి ఉండే నిజమైన వ్యక్తులుగా తీర్చిదిద్దిన ప్రముఖ నాయకుల్లో వెంకయ్య ఒకరని అన్నారు. తాను పార్టీ యువ మోర్చాలో ఉన్నప్పుడు సీనియర్‌ నాయకుడిగా తనతోపాటు తనలాంటి అనేక మందికి మార్గదర్శనం చేసి, సలహాలు, సూచనలు అందించారని గుర్తు చేసుకున్నారు. ఉపరాష్ట్రపతిగా ఆయన పదవీ విరమణ చేసినా, తమదైన విలక్షణ మార్గంలో ప్రజలకు దగ్గరగానే ఉన్నారని, నేటికీ వారి మార్గదర్శకత్వం, సలహాలు, సూచనలను స్వాగతిస్తూ, వారి ఆలోచనల నుంచి స్ఫూర్తిని పొందుతూనే ఉన్నట్లు తెలిపారు. లోక్‌సభ స్పీకర్‌గా తాను బాధ్యతలు స్వీకరించిన సమయంలో వెంకయ్య అందించిన సలహాలు, సూచనలు మరువలేనని అన్నారు. ఈతరానికి స్ఫూర్తిని పంచే నాయకుల్లో వెంకయ్య ప్రథమ స్థానంలో ఉంటారని తెలిపారు. వెంకయ్యనాయుడు దిశానిర్దేశకత్వంలో సాగుతున్న స్వర్ణభారత ట్రస్ట్‌ ఎంతో ప్రత్యేకమైనదని కితాబిచ్చారు.   ప్రజా జీవితంలో ఆయన సుదీర్ఘ ప్రస్థానం, అన్నిటికీ మించి పేద, అణగారిన వర్గాలకు సేవ చేయాలన్న ఆయన అలుపెరుగని ఉత్సాహం ఆదర్శనీయమైనవని కొనియాడారు. 


సేవకు తావు లేని జీవితం రుచిలేని భోజనం లాంటిది


సేవకు తావు లేని జీవితం రుచిలేని భోజనం వంటిదని, ప్రతి ఒక్కరూ జీవితంలో సేవను ఓ భాగంగా చేసుకోవాలని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. జీవితంలో అన్నీ మనం ఊహించినట్లు జరగవని తెలిపారు. ముఖ్యంగా అధికారానికి మనం దగ్గరగా వెళ్లే కొద్దీ దూరమవుతుందని, దూరంగా వెళ్లే కొద్దీ దగ్గరవుతుందన్నారు. జీవితంలో ఏదీ ఆశించకుండా పని చేసుకుంటూ ముందుకు సాగడం వల్ల ప్రశాంతంగా అనుకున్నది చేయగలిగానని, ప్రజలకు చేసిన సేవ అధికారంగా మారి, మరింత సేవ చేసే అవకాశాన్ని ఇచ్చిందన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలియజేసిన ఆయన విజయదశమి దుష్టసంహారానికి చిహ్నమని, అవినీతి లాంటి సామాజిక జాఢ్యాలపై విజయదశమి పోరాట స్ఫూర్తిని రగిలించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వెంకయ్యనాయుడు సతీమణి ఉషమ్మ, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి, స్వర్ణభారత ట్రస్ట్‌ చైర్మన కామినేని శ్రీనివాస్‌, స్వర్ణభారత ట్రస్టీ దీపావెంకట్‌, ముప్పవరపు ఫౌండేషన చైర్మన ముప్పవరపు హర్షవర్ధన నాయుడు, ప్రముఖ గాయకుడు గంగాధర్‌ శ్రాస్తి తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2022-10-04T05:36:57+05:30 IST