పాఠశాల విలీనం మాకొద్దు
ABN , First Publish Date - 2022-09-14T05:11:46+05:30 IST
‘మా పిల్లలను ప్రమాదాలకు గురి చేసే ఈ పాఠశాల విలీనం మాకొద్దంటూ బుచ్చిరెడ్డిపాళెంలోని బాలకృష్ణ గిరిజనకాలనీ వాసులు మంగళవారం స్థానిక ఎంపీపీ ఆదర్శ ప్రాథమిక పాఠశాలకు తాళం వేసి పిల్లలతో కలిసి తల్లిదండ్రులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.
పాఠశాలకు తాళం వేసి తల్లిదండ్రుల నిరసన
బుచ్చిరెడ్డిపాళెం,సెప్టెంబరు13: ‘మా పిల్లలను ప్రమాదాలకు గురి చేసే ఈ పాఠశాల విలీనం మాకొద్దంటూ బుచ్చిరెడ్డిపాళెంలోని బాలకృష్ణ గిరిజనకాలనీ వాసులు మంగళవారం స్థానిక ఎంపీపీ ఆదర్శ ప్రాథమిక పాఠశాలకు తాళం వేసి పిల్లలతో కలిసి తల్లిదండ్రులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ తమ ప్రాంతంలో నివాసాలుండే వారి పిల్లలకు 8వతరగతి వరకు ఈ పాఠశాలలోనే అవకాశం కల్పిస్తామని చెప్పి గుడి స్థలాన్ని కూడా కలిపేసి బడి నిర్మించారన్నారు. ఇప్పుడు ఈ పాఠశాలలోని 3,4,5 తరగతులను కిలోమీటరు దూరంలో ఉన్న డీఎల్ఎన్ఆర్ హైస్కూల్కు మార్చారన్నారు. చిన్నారులు అంత దూరం నడచి వెళ్లలేక మార్గమధ్యంలో ప్రమాదాలకు గురౌతూ నానా అవస్థలు పడుతున్నా పట్టించుకునే అధికారులే లేరన్నారు. స్కూలు గురించి ధర్నా చేస్తే కేసులు పెడతామని పోలీసులు హెచ్చరించారన్నారు. 15రోజులుగా పిల్లలు ఆ పాఠశాలకు పోలేక, ఈ పాఠశాలలో చేర్చుకోక విద్యకు దూరమౌతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పిల్లలకు ఈ పాఠశాలలోనే చేర్చుకోవాలని పాఠశాల కమిటీ చైర్మన్, వైస్ చైర్మెన్లను డిమాండ్ చేశారు.