71గ్రామాల్లో రీసర్వే పూర్తి
ABN , First Publish Date - 2022-10-12T05:03:24+05:30 IST
నెల్లూరు రెవెన్యూ డివిజన్ పరిధిలో రెండువిడతల్లో 71 రెవెన్యూ గ్రామాల్లో రీసర్వే పూర్తి చేశామని నెల్లూరు ఆర్డీవో మాలోల తెలిపారు.
మనుబోలు, అక్టోబరు 11: నెల్లూరు రెవెన్యూ డివిజన్ పరిధిలో రెండువిడతల్లో 71 రెవెన్యూ గ్రామాల్లో రీసర్వే పూర్తి చేశామని నెల్లూరు ఆర్డీవో మాలోల తెలిపారు. మంగళవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో రీసర్వేపై ఆయన సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ రీసర్వేతో భూమి స్థితి కచ్చితంగా వస్తుందన్నారు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల అక్టోబరులో హక్కుపత్రాలు ఇవ్వడంలో జాప్యం జరిగిందన్నారు. హక్కుపత్రాల పంపిణీలో ఎలాంటి తప్పిదాలు లేకుండా మరో మారు రికార్డుల పరిశీలన చేయిస్తున్నామన్నారు. రోవర్, డ్రోన్లతో రీసర్వే ఎన్నిదఫాలు చేసినా ఒకేలా వస్తుందన్నారు. తొలివిడతలో 37, రెండో విడతలో 34 గ్రామాల్లో రీసర్వేని పక్కాగా చేయించామన్నారు. ప్రజలకు నిత్యావసర సరుకుల పంపిణీలో ఎండీయూ ఆపరేటర్లు అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఉప తహసీల్దార్లు బాలకోటమ్మ, , నాగేశ్వరరావు, ఆర్ఐ. శివప్రసాద్, వీఆర్వోలు పాల్గొన్నారు.