గర్భస్థ లింగనిర్ధారణ పరీక్షలు జరిపితే చర్యలు : ఆర్డీవో
ABN , First Publish Date - 2022-06-08T03:20:27+05:30 IST
గర్భస్థ లింగనిర్ధారణ పరీక్షలు జరిపితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఆర్డీవో శీనానాయక్ పేర్కొన్నారు.
కావలి : గర్భస్థ లింగనిర్ధారణ పరీక్షలు జరిపితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఆర్డీవో శీనానాయక్ పేర్కొన్నారు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో మంగళవారం వైద్యఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఆ చట్టానికి చెందిన పత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ రాష్ట్రంలో మగపిల్లల సంఖ్య పెరిగి ఆడపిల్లలు తగ్గుతున్నారన్నారు. గర్భస్థ లింగనిర్ధారణ పరీక్షలు నిర్వహించి ఆడపిల్లలని నిర్దారణ అయితే గర్భంలోనే కొందరు వారిని హతమారుస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయన్నారు. కనుక స్కానింగ్ సెంటర్లు, డాక్టర్లు గర్భస్థ లింగనిర్ధారణ పరీక్షలు జరిపినట్లు తేలిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. స్కానింగ్ సెంటర్లుపై అప్పుడప్పుడు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి అలాంటి వారిని గుర్తించాలని వైద్యఆరోగ్యశాఖ అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో కావలి ఉపవైద్య ఆరోగ్యశాఖ అధికారి భగీరథదేవీ, సీడీపీవో పద్మజ, ఒకటో పట్టణ ఎస్ఐ ఆదిలక్ష్మి, ఏరియా వైద్యశాల డాక్టర్ విజయభాస్కర్రెడ్డి, ఎన్జీవో ప్రెసిడెంట్ శివకుమార్, సామాజిక కార్యకర్త మాలకొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు.