సొంత అవసరాలకు మట్టి తోలుకుంటే అడ్డుకుంటారా?
ABN , First Publish Date - 2022-09-28T04:05:23+05:30 IST
ఇల్లు కట్టుకునేందుకు, ఇతర సొంత అవసరాలకు మట్టి తోలుకుంటుంటే కావాలని అడ్డుకుంటున్నారని కృష్ణపట్నం గ్రామస్థులు ఆందోళన చేశారు.
ముత్తుకూరు, సెప్టెంబరు 27 : ఇల్లు కట్టుకునేందుకు, ఇతర సొంత అవసరాలకు మట్టి తోలుకుంటుంటే కావాలని అడ్డుకుంటున్నారని కృష్ణపట్నం గ్రామస్థులు ఆందోళన చేశారు. బకింగ్హామ్ కాలువ సమీపంలో స్థానిక టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో గ్రామస్థులు మంగళవారం ఆందోళన చేశారు. అనాదిగా బకింగ్హామ్ కాలువ అవతలి నుంచి లెవలింగ్, ఇతర అవసరాల కోసం కృష్ణపట్నంలో మట్టి తోలుకుంటున్నారన్నారు. మండలంలో చెరువులు ఇసుక దిబ్బలను అక్రమంగా తరలిస్తుంటే పట్టించుకోని అధికారులు తమ సొంత అవసరాలకు మట్టి తోలుకుంటే అడ్డుపడడం విడ్డూరంగా ఉందన్నారు. ఆదివారం మట్టి తోలడాన్ని ఆపాలని వీఆర్వో చెబితే నిలిపివేశామని, గ్రామంలో దండోరా వేయించాలని అడిగామని అన్నారు. అలాగేనన్న అధికారులు ఇప్పటి వరకు దండోరా వేయించడానికి ఎందుకు వెనుకాడుతున్నారో చెప్పా లన్నారు. తమకు స్పష్టమైన న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించబోమన్నారు. ఈ విషయంపై తహసీల్దారు మనోహర్బాబు స్పందిస్తూ ప్రభుత్వ భూముల్లో అనుమతి లేకుండా ఇసుక తవ్వకాలు జరపకూడదన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల నాయకులు ఏకొల్లు కోదండరామయ్య, రాగాల శివకృష్ణ, అంకయ్య, గ్రామకాపులు పాల్గొన్నారు.