విజిటింగ్‌ ప్రొఫెసర్‌లా వచ్చి పోవడం తప్ప.. ప్రజలకు చేసిందేమి లేదు

ABN , First Publish Date - 2022-12-08T23:34:15+05:30 IST

ప్రజలకు మేలు జరుగుతుందన్న ఆశతో ఉపఎన్నికలో నియోజకవర్గ ప్రజలు మేకపాటి విక్రమ్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకున్నారు.

విజిటింగ్‌ ప్రొఫెసర్‌లా వచ్చి పోవడం తప్ప..  ప్రజలకు చేసిందేమి లేదు
సమావేశంలో మాట్లాడుతున్న కన్నబాబు

మర్రిపాడు, డిసెంబరు 8: ప్రజలకు మేలు జరుగుతుందన్న ఆశతో ఉపఎన్నికలో నియోజకవర్గ ప్రజలు మేకపాటి విక్రమ్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకున్నారు. అయితే ఎన్నికలు అయిన తర్వాత కేవలం విజిటింగ్‌ ప్రొఫెసర్‌ మాదిరిలా నియోజకవర్గానికి వచ్చి, పోవటమే తప్ప ప్రజలకు చేసిందేమి లేదు. అడిగే వారు లేరన్నుకున్నారేమో? అంటూ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డిపై టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీ గూటూరు మురళీకన్నబాబు మండి పడ్డారు. గురువారం మర్రిపాడులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ సోమశిల హైలెవల్‌ కెనాల్‌ మొదటి ఫేస్‌ పనులు పక్కన పెట్టి సెకెండ్‌ ఫేస్‌ పనులు చేయమని మిమ్మల్ని ఎవరు అడిగారు? తాగు, సాగునీరు అందించాలనే ఉద్దేశం మీకుంటే భూసేకరణ చేసి మొదటి ఫేస్‌ పనులు పూర్తి చేసేవారు. కేవలం కమీషన్లు దండుకోవటానికే సెకెండ్‌ ఫేస్‌ పనులు చేస్తున్నారని సూటిగా ఎమ్మెల్యే విక్రమ్‌రెడ్డిని ప్రశ్నించారు. అలాగే రైతు భరోసా కేంద్రాలకు యూరియా అందించలేకపోతున్నారు. నియోజకవర్గ సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్లే చనువు మీకుందా? అని ప్రశ్నించారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు ఆరికట్ల జనార్దన్‌నాయుడు, కర్రావుల శ్రీనివాసులు, ఎలగాల వెంకటేశ్వర్లు, పాలెం పోలయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-08T23:34:32+05:30 IST