భూ కుంభకోణాలకు కేరాఫ్‌ అడ్రస్‌ సర్వేపల్లి

ABN , First Publish Date - 2022-05-19T04:48:28+05:30 IST

వైసీపీ మూడేళ్ల పాలనలో సర్వేపల్లి నియోజకవర్గం రాష్ట్రంలోనే భూ కుంభకోణాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విమర్శించారు.

భూ కుంభకోణాలకు కేరాఫ్‌ అడ్రస్‌ సర్వేపల్లి
ఓ వృద్ధుడికి కరపత్రాన్ని అందిస్తున్న మాజీ మంత్రి సోమిరెడ్డి

 మాజీ మంత్రి సోమిరెడ్డి

వెంకటాచలం, మే 18 : వైసీపీ మూడేళ్ల పాలనలో సర్వేపల్లి నియోజకవర్గం రాష్ట్రంలోనే భూ కుంభకోణాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విమర్శించారు. మండలంలోని ఎగువమిట్టలో బుధవారం సాయంత్రం జరిగిన బాదుడే బాదుడు కార్యక్రమంలో ఆయన ఇంటింటికి తిరిగి కరపత్రాలను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఒక్క వెంకటాచలం మండలంలోనే వందల కోట్లు విలువ చేసే 500 ఎకరాలకుపై ప్రభుత్వ, గిరిజనుల భూములు మాయమైపోయాని తెలిపారు. గతంలో కాకుటూరులో ఎకరా రూ.6 కోట్లు విలువ చేసే భూమి రికార్డులు తారుమారు చేసిన తహసీల్దారును సస్పెండ్‌ చేసి ఉంటే ఇలా జరిగేది కాదన్నారు. పొదలకూరులో జరిగిన భూకుంభకోణంపై తాము లోక్తాయుక్తకు కూడా ఫిర్యాదు చేయడంతో నిజానిజాలు బయటపడి పూర్వ తహసీల్దారు స్వాతి సస్పెండ్‌ అయ్యారని,  కాకాణి ముఖ్య అనుచరులు ఐదుగురు జైలుకు వెళ్లారని అన్నారు.  అప్పుడే వెంకటాచలం తహసీల్దారును సస్పెండ్‌ చేసి ఉంటే నేడు ఈ మండలంలో 500 ఎకరాలు ఉండేవన్నారు. వెంకటాచలం తహసీల్దార్‌ సస్పెండ్‌ అయ్యేవరకు విడిచిపెట్టే ప్రసక్తే లేదన్నారు. మంత్రి కాకాణి రౌడీ రాజ్యంలో అవినీతి, అక్రమాలు, అక్రమ కేసులు, దౌర్జన్యాలు, దాడులకు అడ్డుఅదుపులేకుండా పోయిందని విమర్శించారు. తొలుత ఆయన శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం జనార్థన్‌రెడ్డి, మునేంద్ర కుటుంబాలను పరామర్శించారు. కార్యక్రమంలో గుమ్మడి రాజాయాదవ్‌, రావూరి రాధాకృష్ణమనాయుడు, మావిళ్ళపల్లి శ్రీనివాసులు నాయుడు, చల్లా నాగార్జున్‌రెడ్డి, ముక్కు చంద్రశేఖర్‌, ముక్కు రాంప్రసాద్‌, అల్లపాక మల్లికార్జున్‌ తదితరులున్నారు. 

రాష్ట్రంలో అభివృద్ధి శూన్యం : మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి 

విడవలూరు  : వైసీపీ పాలనలో రాష్ర్టాభివృద్ధి శూన్యమని కోవూరు మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి  విమర్శించారు. మండలంలోని అలగానిపాడులో బుధవారం జరిగిన బాదుడేబాదుడు కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజలకు కరపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో మైనింగ్‌, ఇసుక దోపిడీ జరుగుతోందన్నారు. ధాన్యం కొనుగోలులో రైతులకు అన్యాయం జరుగుతుంటే ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి నిమ్మకు నిరేత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రానున్న రోజుల్లో వైసీపీకి రైతులు, పేదలు తగిన బుద్ధి చెపుతారన్నారు. కార్యక్రమంలో టీడీపీ నెల్లూరు పార్లమెంట్‌ అధికార ప్రతినిధి చెముకుల కృష్ణ చైతన్య, మండల అధ్యక్షుడు చెముకుల శ్రీనివాసులు, నాయకులు కొపర్తి హరనాథ్‌, ఇమాంబాషా, మాతూరు శ్రీనివాసులురెడ్డి, రామిశెట్టి వెంకటేశ్వర్లు, పొన్నాడి చంద్రశేఖర్‌, సత్యవోలు సత్యంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.  కాగా రామతీర్థంలో ఆ గ్రామ మాజీ సర్పంచు చిమటా వెంకటేశ్వర్లు, మాజీ జడ్పీటీసీ చిమటా రమాదేవిలను పోలంరెడ్డి పరామర్శించారు. చిమటా వెంకటేశ్వర్లు తల్లి ఉత్తర క్రియల్లో ఆయన  పాల్గొని నివాళి అర్పించారు.

తోటపల్లిగూడూరు : మండలంలోని కోడూరు పంచాయతీ ముత్యాలపాలెం గ్రామంలో   బాదుడే బాదుడు కార్యక్రమం జరిగింది.  ఈ సందర్భంగా  టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బొమ్మి సురేంద్ర మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరించిందని విమర్శించారు. అనంతరం ఇంటింటికి కరపత్రాలు పంపిణీ  చేశారు. కార్యక్రమంలో నాయకలు వీరబోయిన గంగాధర్‌, మాజీ ఎంపీటీసీ శ్రీనివాసులు, ఆవుల మునిరత్నం, మాజీ సర్పంచ్‌ ఊటుకూరు శ్రీనివాసులు, రామాంజనేయులు, పరంధామయ్య, బైనుబోయిన సుధాకర్‌, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. 

మనుబోలు : రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌ చార్జీలు పెంచి పేద ప్రజల నడ్డి విరుస్తోందని టీడీపీ జిల్లా ఆర్గనైజింగ్‌ కార్యదర్శి పొన్నూరు రామకృష్ణయ్య అన్నారు. స్థానిక కోదండరామపురంలోని దళితవాడలో బుధవారం టీడీపీ నాయకులు బాదుడే బాదుడు కార్యక్రమాన్ని నిర్వహించారు. పెంచిన విద్యుత్‌ చార్జీలపై ఇంటింటికి వెళ్లి కరపత్రాలు  ఇచ్చి కొవ్వొత్తులు అందజేశారు. కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షుడు గాలి రామకృష్ణారెడ్డి, నియోజకవర్గ తెలుగుయువత అధ్యక్షుడు శివుడు రాజా గౌడ్‌, గ్రామ కమిటీ అధ్యక్షుడు సాని వెంకటరమణయ్య, చెల్లగిరి ప్రసాద్‌, 3వవార్డు సభ్యురాలు దుర్తాటి సౌజన్య తదితరులు పాల్గొన్నారు. 

కొడవలూరు : వైసీపీ పాలనలో పేద ప్రజలు అవస్థలు పడుతున్నారని టీడీపీ మండల అఽధ్యక్షుడు కోటంరెడ్డి అమరేంద్రరెడ్డి అన్నారు. స్థానిక ఎన్టీఆర్‌ కాలనీలో బుధవారం ఇంటింటికి టీడీపీ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా కోటంరెడ్డి హాజరైన అమరేంద్రరెడ్డికి  ప్రజలు పూలమాలలు వేసి ఘన స్వాగతం పలికారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ పాలనలో పెరిగిన నిత్యావసరాలు, పెట్రోల్‌, డీజల్‌ ధరలతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారన్నారు. ఎన్టీఆర్‌ కాలనీ దిశ దశ మార్చిన ఘనత మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డికే దక్కుతుందన్నారు. నియోజకవర్గంలో ఎక్కడకెళ్లినా పోలంరెడ్డి శంకుస్థాపన శిలాఫలకలు దర్శనమిస్తూన్నాయని అన్నారు. కార్యక్రమంలో నాయ కులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-19T04:48:28+05:30 IST