‘కండలేరు’లో నిలకడగా నీటిమట్టం!

ABN , First Publish Date - 2022-09-17T05:44:49+05:30 IST

కండలేరు డ్యాంలో ఈ సీజన్‌లో 50 టీఎంసీల నీటినిల్వకే పరిమితం చేసి, డ్యాంలో నిలకడగా నీటిమట్టాన్ని ఉంచుతామని తెలుగుగంగ చీఫ్‌ ఇంజనీరు హరినారాయణరెడ్డి తెలిపారు.

‘కండలేరు’లో నిలకడగా నీటిమట్టం!
కండలేరు డ్యాం అతిథిగృహం వద్ద ఇంజనీర్లతో సీఈ హరినారాయణరెడ్డి

 50టీఎంసీలకు పరిమితం చేస్తాం

వర్షాకాలంలో పూర్తిస్థాయిలో నిల్వ చేస్తాం

‘ఆంధ్రజ్యోతి’తో తెలుగుగంగ సీఈ హరినారాయణ 


రాపూరు, సెప్టెంబరు 16 : కండలేరు డ్యాంలో ఈ సీజన్‌లో 50 టీఎంసీల నీటినిల్వకే పరిమితం చేసి, డ్యాంలో నిలకడగా నీటిమట్టాన్ని ఉంచుతామని తెలుగుగంగ చీఫ్‌ ఇంజనీరు హరినారాయణరెడ్డి  తెలిపారు. కండలేరు డ్యాంలో 50టీఎంసీల నీటి నిల్వ నమోదు కావడంతో శుక్రవారం సాయంత్రం కండలేరుడ్యాం, హెడ్‌రెగ్యులేటర్‌, స్పీల్‌వే, హైలెవల్‌, లో లెవల్‌స్లూయిస్‌ నిర్మాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ‘ఆంధ్రజ్యోతి’తో సీఈ మాట్లాడుతూ డ్యాంలో ప్రస్తుతం 50టీఎంసీల నీటి నిల్వకే పరిమితం చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో డిసెంబరు వరకు వర్షాలు, తుఫాన్‌ల సీజన్‌ కావడంతో ముందుజాగ్రత్త చర్యగా సోమశిల నుంచి విడుదల చేస్తున్న నీటిని తగ్గించినట్లు తెలిపారు.   సోమశిల నుంచి వస్తున్న 8వేల క్యూసెక్కులను 2740లకు తగ్గించినట్లు, డ్యాం నుంచి 800 నుంచి 1410 క్యూసెక్కులకు నీటి విడుదల పెంచినట్లు తెలిపారు. రానున్న వర్షాల సీజన్‌లో పూర్తిస్థాయి నీటిమట్టం 68టీఎంసీల నిల్వ చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. డ్యాంలో నిర్మాణంలో ఉన్న స్పిల్‌వే పనులు తుది దశకు చేరుకున్నట్లు ప్రకటించారు. 


ఇంజనీర్లతో సమీక్ష

కండలేరు డ్యాంలో 50టీఎంసీల నీరు నిల్వ చేరడంతో డ్యాం ఇంజనీర్లతో సీఈ సమీక్షించారు. ముంపు గ్రామాల సమస్యలు పరిష్కరించి, డ్యాంలో పూర్తిస్థాయి నీటి నిల్వకు చర్యలు తీసుకుందామని వివరించారు. డ్యాం ఇంజనీర్లు ఎప్పటికప్పడు కట్టమీద వాచ్‌ అండ్‌ వార్డు చేస్తూ ఎలాంటి పుకార్లు వ్యాపించకుండా చూడాలన్నారు. ఈ సమీక్షలో డ్యాం ఈఈ విజయ్‌కుమార్‌, జేఈఈ శ్రీనివాసులు పలువురు ఇంజనీర్లు ఉన్నారు. 

Updated Date - 2022-09-17T05:44:49+05:30 IST