అప్పులతో పంచాయతీని ఎన్నిరోజులు నడిపించగలం

ABN , First Publish Date - 2022-09-09T04:35:27+05:30 IST

అప్పులు చేసి గ్రామ పంచాయతీని ఎన్ని రోజులు నడిపించగలమని జొన్నవాడ సర్పంచు కందికట్టు పెంచలయ్య ఎంపీడీవోను ప్రశ్నించారు.

అప్పులతో పంచాయతీని ఎన్నిరోజులు నడిపించగలం
సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతున్న జొన్నవాడ సర్పంచు పెంచలయ్య

 సర్వసభ్య సమావేశంలో జొన్నవాడ సర్పంచు ఆవేదన

బుచ్చిరెడ్డిపాళెం,సెప్టెంబరు 8: అప్పులు చేసి గ్రామ పంచాయతీని ఎన్ని రోజులు నడిపించగలమని జొన్నవాడ సర్పంచు కందికట్టు పెంచలయ్య ఎంపీడీవోను ప్రశ్నించారు. గురువారం  స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ శ్రీనివాసులు, ఎంపీడీవో నరసింహారావు అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పెంచలయ్య మాట్లాడుతూ  గ్రామ పంచాయతీల అభివృద్ధికి ఒక్క పైసా ఇవ్వకుంటే ఎలా అని ప్రశ్నించారు. గ్రామంలో తాగునీటి మోటార్లు వేసే సిబ్బంది చనిపోతే బాధిత కుటుంబానికి రూ.3 వడ్డీకి 42వేలు, పారిశుధ్య కార్మికులకు రూ. 24వేలు అప్పు తెచ్చి జీతాలిచ్చుకునే పరిస్థితి నెలకొనడం బాధాకరమన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన జొన్నవాడకు నిత్యం ఎవరోఒకరు అధికారులు వస్తుంటారని, నిధుల్లేకుండా పారిశుధ్యాన్ని ఎలా మెరుగుపరచాలని  ఆవేదన వ్యక్తం చేశారు. ఇస్కపాళెం, కట్టుబడిపాళెం, చెల్లాయపాళెం సర్పంచులు, ఇస్కపాళెం ఎంపీటీసీ కూడా ప్రభుత్వ తీరుపై నిరసన  తెలిపి ఎంపీడీవోతో వాగ్వాదానికి దిగి సమావేశం నుంచి వాకౌట్‌ చేశారు. అనంతరం కార్యాలయం ముందు మరో సారి టీడీపీ నాయకులతో కలిసి నిరసన తెలిపారు. అధికారులు ఇకనుంచైనా 14, 15 ఆర్థిక సంఘ నిధులు ఇచ్చి గ్రామాలను ఆదుకోవాలని కోరారు. గ్రామాల సమస్యలు, నిధులకోసం ప్రభుత్వానికి నివేదికను అందజేస్తామని ఎంపీడీవో తెలిపారు. పెనుబల్లి ఎంపీటీసీ బుచ్చి నుంచి జొన్నవాడ మీదుగా నెల్లూరుకు ఆర్టీసీ బస్సు ఏర్పాటు చేయాలని, రేబాల సర్పంచు, సెక్రటరీలు పలు సమస్యలపై వినతిపత్రాలు అందజేశారు. సమావేశానికి పలు శాఖల అధికారులు డుమ్మా కొట్టారు.

Updated Date - 2022-09-09T04:35:27+05:30 IST