గోదాముల్లో కందిపప్పు నో స్టాక్! అయినా డీడీలు కట్టండి!
ABN , First Publish Date - 2022-09-30T04:36:57+05:30 IST
జిల్లాలో రేషన సరుకుల పంపిణీ అస్తవ్యస్థంగా మారింది. దసరా పండుగ మొదలు కావటంతో కార్డుదారులందరికీ అక్టోబరు కోటా కింద పంచదార, కందిపప్పు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
డీలర్లపై అధికారుల ఒత్తిళ్లు
నాణ్యత లేక రేషనషాపుల్లోనే నిల్వలు
గతంలో రిటర్న్ చేసిన సరుకుకు నగదు ఇవ్వని వైనం
ఇప్పుడు మళ్లీ డీడీలు అంటే ఎలాగని ఆందోళన
నెల్లూరు (హరనాథపురం), సెప్టెంబరు 29 : జిల్లాలో రేషన సరుకుల పంపిణీ అస్తవ్యస్థంగా మారింది. దసరా పండుగ మొదలు కావటంతో కార్డుదారులందరికీ అక్టోబరు కోటా కింద పంచదార, కందిపప్పు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు డీడీలు తీసి ఇవ్వాలని డీలర్లకు సూచించింది. అయితే, సివిల్ సప్లయీస్ గోదాముల్లో కందిపప్పు, చక్కెర స్టాక్ లేకుండానే డీడీలు కట్టమనడంతో డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, జిల్లాలో బియ్యం ప్రతి నెలా ఇస్తుండగా, కందిపప్పు, పంచదార మాత్రం పంపిణీ జరగడంలేదు. గతంలో కందిపప్పు ఇస్తున్నా, అది నాణ్యతగా లేదనే ఆరోపణలు వెల్లువెత్తాయి. కార్డుదారులు విముఖత వ్యక్తం చేయడంతో రేషన దుకాణాల్లో నిల్వ ఉండిపోతోంది. గతంలో తీసుకొన్న కందిపప్పు పుచ్చిపోవడంతో డీలర్లు వాపసు చేశారు. ఆ డబ్బు తిరిగి ఇవ్వలేదని డీలర్లు ఆరోపించారు. ఇప్పుడు మళ్లీ డీడీ తీయాలని ఒత్తిడి చేయడం ఎంతవరకు న్యాయమని వారు ప్రశ్నిస్తున్నారు. 500 కార్డులు ఉండే డీలరు కందిపప్పు, చక్కెరలకు కలిపి రూ.60వేల వరకు డీడీ తీయాల్సి ఉంది. కందిపప్పును గోదాములో చూపిస్తేనే డీడీలు కడతామని డీలర్లు అంటున్నారు. ముందు డీడీలు కట్టండి తర్వాత కందిపప్పు చూపిస్తామని అధికారులు చెబుతుండటంతో డీలర్లు అయోమయంలో పడ్డారు. నాణ్యత లేని కందిపప్పును తీసుకొనేందుకు కార్డుదారులు ఆసక్తి చూపకుంటే తాము నిండా మునిగిపోతామని డీలర్లు వాపోతున్నారు. రేషన దుకాణంలో కిలో కందిపప్పును రూ.67లకు, పంచదార అరకిలో రూ.17లకు ఇస్తున్నారు. పండుగల సీజనలోనైనా నాణ్యమైన కందిపప్పు, చక్కెరను అందచేయాలని కార్డుదారులు కోరుతున్నారు.
డీలర్లపై ఒత్తిడి సరికాదు
కందిపప్పు కోసం డీడీలు కట్టమని డీలర్లపై అధికారులు ఒత్తిడి చేయడం సరికాదు. ఎంఎల్ఎస్ పాయింట్లలో కందిపప్పు స్టాకులేదు. నాణ్యతలేని కందిపప్పును కార్డుదారులు తీసుకోవడం లేదు. నెలల తరబడి కొన్ని రేషన షాపులలో కందిపప్పు నిల్వలు ఉన్నాయి. కొందరు డీలర్లు వాపసు చేసిన కందిపప్పునకు నగదును వెంటనే చెల్లించాలి.
- జీవీ కృష్ణారెడ్డి, నెల్లూరు జిల్లా యునైటెడ్ చౌకధరల దుకాణాదారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి