చేపల మేతగా చికెన్ వ్యర్థాలు
ABN , First Publish Date - 2022-09-27T02:58:19+05:30 IST
మండలంలోని చేపల గుంటల్లో చేపల మేతగా చికెన్ వేస్ట్ (వ్యర్థాలు)ను వేస్తున్నారు. మండలంలోని పడమటిపాళెం, దువ్వూరు
ఆ చేపలను తింటే పలు రకాల వ్యాధులు
సంగం, సెప్టెంబరు 26: మండలంలోని చేపల గుంటల్లో చేపల మేతగా చికెన్ వేస్ట్ (వ్యర్థాలు)ను వేస్తున్నారు. మండలంలోని పడమటిపాళెం, దువ్వూరు, కోలగట్ల తదితర గ్రామాల్లో చేపల గుంటలు ఎక్కువగా ఉన్నాయి. పొలాల యజమానులు ఉత్తరాది జిల్లాల వారికి చేపల గుంటలకు లీజుకు ఇచ్చారు. వీరు చేపల గుంటల్లో రూప్చంద్, ఫంగస్ రకం చేపలను సాగు చేస్తున్నారు. వీటికి సాధారణ మేతకు బదులు తక్కువ ధరకు వచ్చే చికెన్ వ్యర్థాలను విరివిగా వినియోగిస్తున్నారు. దీంతో కొందరు చెన్నై, కడప, పొద్దుటూరు, బెంగళూరు తదితర పట్టణాల నుంచి డమ్ముల్లో చికెన్ వ్యర్థాలు వేసుకుని వ్యానుల ద్వారా తరలించి చేపల గుంటలకు మేతగా వినియోగిస్తున్నారు. ఈ చికెన్ వేస్ట్ దుర్వాసన వెదజల్లుతుండడంతో స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు చికెన్ వేస్ట్తో పెంచిన చేపలను తిన్నందువల్ల పలు వ్యాధులు వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. మత్స్యశాఖ అధికారులు స్పందించి చేపల గుంటలకు చికెన్ వేస్ట్ను వాడకుండా చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.
----------