అల్లూరి స్ఫూర్తి ప్రదాత
ABN , First Publish Date - 2022-07-05T05:42:06+05:30 IST
స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు పోరాట పటిమను నేటి యువత స్ఫూర్తిగా తీసుకుని సమాజాభివృద్ధి కోసం కృషి చేయాలని కలెక్టర్ చక్రధర్బాబు పిలుపునిచ్చారు.
కలెక్టర్, ఎస్పీ ఘన నివాళి
నెల్లూరు(హరనాథపురం/క్రైం), జూలై 4 : స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు పోరాట పటిమను నేటి యువత స్ఫూర్తిగా తీసుకుని సమాజాభివృద్ధి కోసం కృషి చేయాలని కలెక్టర్ చక్రధర్బాబు పిలుపునిచ్చారు. అల్లూరి జయంతి సందర్భంగా సోమవారం కలెక్టరేట్లోని తిక్కన భవన్లో ఆయన చిత్రపటానికి పూల మాలవేసి ఘనంగా నివాళులర్పించారు. గోదావరి ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనుల్లో దేశ భక్తిని రగిలించి స్వాతంత్య్ర విప్లవానికి నాంది పలికిన దేశభక్తుడు అల్లూరి అని కొని యాడారు. తెలుగువారు ఉన్నంత కాలం ఆ మన్యం వీరుడి పేరు గుర్తిండి పోతుందని, ఆయన పేరుతో నేడు జిల్లాను ఏర్పాటు చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృత జ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కూర్మనాథ్, డీఆర్వో నారాయణ మ్మ తదితరులు పాల్గొన్నారు. కాగా, అల్లూరి జయంతి సందర్భంగా ఉమేష్చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో ఎస్పీ సీహెచ్ విజయరావు సోమవారం సీతారామరాజు చిత్రపటానికి నివాళులు అర్పించారు. బ్రిటీష్ ప్రభుత్వంపై పోరాడి 27 ఏళ్ల చిన్న వయసులోనే ప్రాణత్యాగానికి సిద్ధపడిన ధీరుడు అల్లూరి అని కొనియాడారు. ఆయన జీవితం స్ఫూర్తిదాయకమన్నారు.
విప్లవ వీరుడు అల్లూరి
వారసుడు రామకృష్ణంరాజు
నెల్లూరు (సాంస్కృతిక ప్రతినిధి), జూలై 4 : అకుంఠిత దీక్షతో ఉద్యమం వైపు నడిచి, ఆంగ్లేయులను గజగజలాడించిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు అని ఆయన వారసుడు, విశ్రాంత ఎస్పీ అల్లూరి రామకృష్ణంరాజు పేర్కొన్నారు. అల్లూరి 125వ జయంతి సందర్భంగా సోమవారం నెల్లూరులోని ఇస్కాన్సిటీలో అల్లూరి చిత్ర శిలా ఫలకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి యువత సీతా రామరాజును స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. వాకర్స్ ఇంటర్నేషనల్ అధ్యక్షుడు నేతాజీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ అల్లూరి సాహసం అమోఘమని, దేశం యావత్తు ఆయనను గుర్తించి, గౌరవించి జయంతి వేడుకలు జరపడం ప్రతి తెలుగువారు గర్వించదగ్గ విషయమన్నారు. ఈ కార్యక్రమంలో నలుబోలు బలరామయ్యనాయుడు, రాఘవేంద్ర శెట్టి, దంపూరు రామకృష్ణ, రోటరీ, లయన్స్, జేసీస్, వాకర్స్ సంస్థల ప్రతినిధులు, రెవెన్యూ, పోలీసు, విద్యాశాఖ ఉద్యోగులు పాల్గొన్నారు. అంతకు ముందు ఇస్కాన్సిటీలో గౌరవ సూచకంగా నడక యాత్ర నిర్వహించారు.