జెన్‌కో కార్మికుల ఉద్యమానికి దేశవ్యాప్త మద్దతు

ABN , First Publish Date - 2022-09-27T04:22:32+05:30 IST

జెన్‌కో థర్మల్‌ కేంద్రం ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు కార్మికులు చేస్తున్న ఉద్యమానికి దేశవ్యాప్తంగా మద్దతు కూడగడతామని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి మరియం దావలే పేర్కొన్నారు.

జెన్‌కో కార్మికుల ఉద్యమానికి దేశవ్యాప్త మద్దతు
మాట్లాడుతున్న ప్రజాతంత్ర మహిళా సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి మరియం దావలే

ప్రజాతంత్ర మహిళా సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి మరియం దావలే 

ముత్తుకూరు, సెప్టెంబరు 26 : జెన్‌కో థర్మల్‌ కేంద్రం ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు కార్మికులు చేస్తున్న ఉద్యమానికి దేశవ్యాప్తంగా మద్దతు కూడగడతామని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి మరియం దావలే పేర్కొన్నారు. ఏపీ జెన్‌కో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జెన్‌కో జేఏసీ, పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో 250 రోజుల పోరాటం సందర్భంగా థర్మల్‌ కేంద్రం పరిరక్షణ కమిటీ కన్వీనర్‌ ఎం.మోహన్‌రావు అధ్యక్షతన సోమవారం నిర్వహించిన సభలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఏపీ జెన్‌కోను ప్రైవేటీకరణ చేస్తే వినియోగదారులు తీవ్రంగా నష్టపోతారని, ఉద్యోగ  భద్రత ఉండదని, పునరావాస సమస్యలు పరిష్కారం కావన్నారు. దీనిని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో జగన్‌ ప్రభుత్వం ఆస్తులను ఆమ్మేస్తూ తోడుదొంగల్లా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. రూ.20వేల కోట్ల ప్రభుత్వ ఆస్తిని అదానికి అప్పజెప్పడం శోచనీయమన్నారు. జెన్‌కోను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే సహించేది లేదని, అటువంటి పరిస్థితి వస్తే రైతులకు తిరిగి భూమిని అప్పజెప్పాలని, జెన్‌కోలోని కాంట్రాక్ట్‌ కార్మికులందరినీ పర్మినెంట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ పోరాటం తప్పక విజయం సాధించి తీరుతుందన్నారు. ఐద్వా జాతీయ కోశాధికారి పుణ్యవతి మాట్లాడుతూ విశాఖపట్నం ఉక్కు పరిశ్రమను కేంద్రంలోని బీజేపీ ప్రైవేటీకరిస్తుందని, రాష్ట్రంలోని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఏపీ జెన్‌కోను ప్రైవేటీకరిస్తుందని, కార్మికులందరూ ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు స్వరూపరాణి, రెహనాబేగం, గోగుల శ్రీనివాసులు, గడ్డం అంకయ్య, నక్కా రాధయ్య, టీడీపీ నేత పల్లంరెడ్డి రామ్మోహన్‌రెడ్డి, ఏఐటీయూసీ నాయకులు కె.ఆంజనేయులు, ఏఐఎ్‌్‌ఫటీయూ నాయకులు యానాదయ్య, ఏపీ జెన్‌కో జేఏసీ నాయకులు ఆదిశేషయ్య, మోహన్‌రావు, భాస్కర్‌, అనిల్‌, పి.సుబ్బలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-09-27T04:22:32+05:30 IST