Nara Lokesh: అవే జగన్ రెడ్డి పతనానికి దారులు: లోకేష్
ABN , First Publish Date - 2022-07-19T16:34:09+05:30 IST
టీడీపీ నేత నారా లోకేష్ సీఎం జగన్పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
అమరావతి (Amaravathi): టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) సీఎం జగన్ (CM Jagan)పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘‘హత్యలు, దాడులతో టీడీపీ కేడర్ని భయపెట్టాలనుకుంటున్న జగన్ రెడ్డి గారూ! శిశుపాలుడిలా మీ పాపాలు పండిపోయాయి. ప్రజావ్యతిరేకత తీవ్రం కావడంతో, రాజకీయ ఆధిపత్యం కోసం మీరు చేయిస్తున్న హత్యలు, దాడులే మీ పతనానికి దారులు. రొంపిచర్ల మండల టీడీపీ అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ వెన్నా బాలకోటిరెడ్డి (Balakoti reddy)పై హత్యాయత్నం ముమ్మాటికీ మీ వైసీపీ (YCP) గూండాల పనే. బాలకోటిరెడ్డికి ఏమైనా జరిగితే వైసీపీ సర్కారుదే బాధ్యత. దాడిలో ఏకంగా వైసీపీ ఎంపీపీ భర్త పాల్గొన్నాడంటే..మీ రౌడీమూకలు ఎంతగా బరితెగించాయో అర్థం అవుతోంది. ఫ్యాక్షన్ మనస్తత్వం బ్లడ్లోనే ఉన్న మీ పాలనలో పల్నాడు ప్రాంతం రక్తసిక్తమవుతోంది. ఇకనైనా హత్యారాజకీయాలు, దాడులు ఆపండి. లేదంటే ఇంతకి నాలుగింతలు మూల్యం చెల్లించేందుకు సిద్ధంగా వుండండి. జగన్రెడ్డి అధికారం, పోలీసులు అండగా వున్నారని రెచ్చిపోతున్న వైసీపీ నేతలకు ఇదే చివరి హెచ్చరిక. మేము తిరగబడితే, మీ వెంట వచ్చేది ఎవరు? వైసీపీ అధికారం కోల్పోతే మిమ్మల్ని కాపాడేదెవరు?’’ అని నారా లోకేష్ అన్నారు.