ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. ఎల్లుండి నుంచి రంగంలోకి పోలీసులు
ABN , First Publish Date - 2022-11-02T06:31:49+05:30 IST
నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో బేరసారాల కేసు దర్యాప్తులో భాగంగా నోటీసుల జారీకి పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఎమ్మెల్యే
టీ-హైకోర్టు తీర్పుపై సుప్రీంకు వెళ్లిన నిందితులు
శుక్రవారం విచారించనున్న ధర్మాసనం
హైదరాబాద్ / న్యూఢిల్లీ, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో బేరసారాల కేసు దర్యాప్తులో భాగంగా నోటీసుల జారీకి పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డితోపాటు మరో ముగ్గురికి పార్టీ మారడానికి పెద్ద మొత్తంలో డబ్బులు ఆఫర్ చేసి, బేరసారాలు జరిపేందుకు వచ్చిన సతీష్ శర్మ, నందకుమార్, సింహయాజిలను సైబరాబాద్ పోలీసులు గతవారం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రాథమిక విచారణలో వారు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు మరికొందరిని విచారించి వివరాలు రాబట్టాల్సి ఉంది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో మునుగోడు ఉప ఎన్నిక ముగిసేంత వరకు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకునే వీల్లేదు. గురువారం మునుగోడు ఎన్నిక పూర్తి కానుంది. కేసు తీవ్రత నేపథ్యంలో శుక్రవారం నుంచి దర్యాప్తును ముమ్మరం చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. మరోవైపు... నిందితుల తరఫు న్యాయవాదులు న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. నిందితులను రిమాండ్కు అనుమతిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టులో సవాలుచేశారు. శుక్రవారం దీనిపై విచారణ చేపడతామని ధర్మాసనం స్పష్టం చేసింది.