బీసీలకు పెద్దపీట ఇలాగేనా!?
ABN , First Publish Date - 2022-12-10T02:28:59+05:30 IST
బీసీలకు పెద్ద పీట వేస్తున్నామని ప్రభుత్వ పెద్దల నుంచి వైసీపీ ముఖ్యనేతల వరకు ఊదరగొడుతుంటారు.
వారిని నిలబెట్టి మంత్రి పెద్దిరెడ్డి ప్రెస్మీట్
అనంతపురం, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): బీసీలకు పెద్ద పీట వేస్తున్నామని ప్రభుత్వ పెద్దల నుంచి వైసీపీ ముఖ్యనేతల వరకు ఊదరగొడుతుంటారు. కానీ, క్షేత్రస్థాయిలో చూస్తే, ఆ పార్టీలోని బీసీ నేతలకు కనీసం కుర్చీవేసి గౌరవించే దిక్కు లేదు. అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలోని మంత్రి ఉష శ్రీచరణ్ నివాసంలో శుక్రవారం జరిగిన ప్రెస్ మీటే ఇందుకు నిదర్శనంగా నిలిచింది. మీడియా సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక్కరే కుర్చీలో కూర్చున్నారు. సహచర మంత్రి ఉష శ్రీచరణ్తోపాటు బీసీ సామాజికవర్గం ప్రజాప్రతినిధులందరూ పక్కన నిలబడ్డారు. నిలబడిన వారిలో ఎంపీ రంగయ్య, జడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, వైసీపీ జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య, ఏపీఐఐసీ చైర్మన్ మెట్టు గోవిందురెడ్డి తదితరులు ఉన్నారు. లోలోపల నొచ్చుకున్నా, పెద్దిరెడ్డి ప్రభుత్వ పెద్ద కావడంతో నోరు మెదపలేకపోయారని చెబుతున్నారు.