Mandus: వణికిస్తున్న మాండస్

ABN , First Publish Date - 2022-12-10T02:13:54+05:30 IST

బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మాండస్‌’ తుఫాన్‌ తీరప్రాంత జిల్లాలను వణికిస్తోంది. తుఫాన్‌ ప్రభావంతో తీరం వెంబడి పెనుగాలులు వీస్తున్నాయి.

Mandus: వణికిస్తున్న  మాండస్

తీరం వెంబడి పెనుగాలులు.. ఎగసిపడుతున్న అలలు

దక్షిణ కోస్తా, రాయలసీమ,

తమిళనాడుల్లో విస్తారంగా వర్షాలు

మహాబలిపురానికి చేరువగా తుఫాన్‌

తీవ్ర తుఫాన్‌ నుంచి కొద్దిగా

బలహీనపడి తుఫాన్‌గా మార్పు

ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి,

దక్షిణ కోస్తాకు రెడ్‌ మెసేజ్‌

నేడు, రేపు వర్షాల ముప్పు

తిరుపతిలో దిగకుండానే వెనుదిరిగిన

2 విమానాలు.. మరో సర్వీసు రద్దు

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌) : బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మాండస్‌’ తుఫాన్‌ తీరప్రాంత జిల్లాలను వణికిస్తోంది. తుఫాన్‌ ప్రభావంతో తీరం వెంబడి పెనుగాలులు వీస్తున్నాయి. అలలు ఎగసిపడుతుండటంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. తీవ్ర తుఫాన్‌ శుక్రవారం ఉదయానికి కొద్దిగా బలహీనపడి నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతోంది. ఇది సగటున గంటకు 12 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయువ్యంగా పయనిస్తూ మధ్యాహ్నానికి ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా మధ్య మహాబలిపురానికి 65 కిలోమీటర్లు ఆగ్నేయంగా, చెన్నైకి 100 కిలోమీటర్లు దక్షిణ ఆగ్నేయంగా కేంద్రీకృతమై ఉంది. సముద్రం నుంచి తీరం దిశగా పెద్దఎత్తున మేఘాలు రావడంతో భారీవర్షాలు, అక్కడక్కడా కుంభవృష్టిగా వర్షాలు కురుస్తాయన్న అంచనాతో ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తాకు భారత వాతావరణ శాఖ రెడ్‌ మెసేజ్‌ జారీ చేసింది. ఇదిలా ఉండగా, మాండస్‌ తుఫాన్‌ వాయవ్యంగా పయనించి శుక్రవారం రాత్రి 11.30 నుంచి అర్ధరాత్రి 2.30 గంటల మధ్య మహాబలిపురం వద్ద తీరం దాటనుంది. తరువాత శనివారం తెల్లవారుజాము నాటికి బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారి వాయవ్యంగా పయనిస్తుందని వాతావరణ శాఖ తెలిపింది.

కాగా, తుఫాన్‌ ప్రభావంతో నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో భారీగా, మిగిలిన ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. తుఫాన్‌ తీరం దాటే సమయంలో గంటకు 65నుంచి 75, అప్పుడప్పుడు 85 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, శనివారం ఉదయం నుంచి గాలుల ఉధృతి స్వల్పంగా తగ్గుతుందని వాతావరణ శాఖ తెలిపింది. చెన్నై పరిసరాలతో పాటు దక్షిణ కోస్తా, రాయలసీమల్లోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు, పలుచోట్ల అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. శనివారం కోస్తా, రాయలసీమల్లో విస్తారంగా వర్షాలు, చిత్తూరు, అన్నమయ్య, శ్రీసత్యసాయి జిల్లాల్లో అతిభారీగా, నెల్లూరు, తిరుపతి, వైఎస్సార్‌ కడప, అనంతపురం జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. 11న రాయలసీమ, ఉత్తర కోస్తాలో అనేకచోట్ల, దక్షిణ కోస్తాలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని తెలిపింది. తుఫాన్‌ ప్రభావంతో కృష్ణపట్నం, నిజాంపట్నం, మచిలీపట్నంలో మూడో నంబరు, కాకినాడ, గంగవరం, విశాఖ ఓడరేవుల్లో రెండో నంబరు భద్రతా సూచిక ఎగురవేసినట్టు విశాఖ తుఫాన్‌ హెచ్చరిక కేంద్రం తెలిపింది.

తిరుపతి జిల్లాలో గురువారం అర్ధరాత్రి నుంచే చలి గాలులు, వర్షాలు మొదలయ్యాయి. శుక్రవారం జిల్లావ్యాప్తంగా వర్షాలు పడ్డాయి. పలుచోట్ల పంటనష్టం సంభవించింది. వాకాడులో 40మీటర్లు, కోటలో 20మీటర్ల మేర సముద్రం ముందుకొచ్చింది. ఉప్పుటేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో పంబలి, శ్రీనివాససత్రం, కాకివాకం తదితర తీరప్రాంత గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. హైదరాబాద్‌ నుంచి తిరుపతికి చేరుకుని ఉదయం 7.40కి ముంబై వెళ్లాల్సిన విమానం, బెంగుళూరు నుంచి తిరుపతి మీదుగా వైజాగ్‌ వెళ్లాల్సిన స్సైస్‌జెట్‌ విమానం వాతావరణం అనుకూలించక 20నిమిషాల పాటు గాల్లోనే చక్కర్లు కొట్టి వెనక్కి వెళ్లిదపోయాయి. ముంబై వెళ్లాల్సిన విమానం మళ్లీ 3గంటలు ఆలస్యంగా తిరుపతి చేరుకుని ముంబై బయల్దేరి వెళ్లింది. మరో సర్వీసును రద్దు చేశారు.

తిరుమలలో ఎడతెరిపిలేని వర్షం

తిరుమలలో శుక్రవారం ఎడతెరిపిలేని వర్షం కురిసింది. శుక్రవారం వేకువజాము నుంచే చిరుజల్లులతో కూడిన వర్షం మొదలైంది. ఈదురుగాలులతో పాటు వర్షం కురుస్తూనే ఉంది. దీంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. కాలినడకన తిరుమలకు వచ్చే యాత్రికులు కూడా వర్షంతో ఇబ్బందులు పడ్డారు.

అదానీ పోర్టులో 6వ నంబరు హెచ్చరిక

నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నంలోని ఆదాని పోర్టులో 6వ నంబరు హెచ్చరిక ఎగురవేశారు. లోతట్టు ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. కాగా, పశ్చిమగోదావరి జిల్లాలో తుఫాన్‌ కారణంగా వరి పంట మాసూళ్లకు అవరోధం ఏర్పడుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. కాకినాడ జిల్లా ఉప్పాడలో అలలు భారీస్థాయిలో ఎగసిపడుతున్నాయి. రెండుచోట్ల వంతెనల కింద నుంచి కెరటాలు రోడ్డుకు అవతలవైపు దూసుకువెళ్లాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో కాకినాడ యాంకరేజ్‌ పోర్టు నుంచి విదేశాలకు బియ్యం ఎగుమతులు నిలిచిపోయాయి. కాగా, భారీ గాలులకు కరప మండలంలో ఓ తాటిచెట్టు నేలకూలి, అటుగా వెళ్తున్న ద్విచక్ర వాహనదారుడిపై పడటంతో ఆయన క్కడికక్కడే మృత్యువాత పడ్డాడు.

ముత్తుకూరులో 130మి.మీ. వర్షం

తుఫాన్‌ ప్రభావంతో నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలో అత్యధికంగా 130మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నాయుడుపేట, సైదాపురం, మునుబోలు, వెంకటాచలం, కోట, అల్లూరు, విడవలూరు మండలాల్లో 100 మి.మీ. పైగా వర్షం పడింది. వర్షాల కారణంగా నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో వరి, ప్రకాశం జిల్లాలో పప్పుశనగ, ఇతర సీమ జిల్లాల్లో వేరుశనగ, చిరుధాన్యాల పంటలు, ఉద్యాన తోటలకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది. తుఫాన్‌ తీరం దాటాక శనివారం ఉదయం నుంచి నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీంతో ఈ నాలుగు జిల్లాలకు ఆరెంజ్‌ హెచ్చరిక లిచ్చారు. సహాయక చర్యల కోసం నెల్లూరు 3, చిత్తూరు, తిరుపతి, ప్రకాశం జిల్లాల్లో రెండు చొప్పున మొత్తం 5 ఎన్డీఆర్‌ఎఫ్‌, 4ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలను సిద్ధంగా ఉంచారు. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ అంబేద్కర్‌ హెచ్చరించారు.

Updated Date - 2022-12-10T02:13:54+05:30 IST

Read more