భూ సమస్యలు వేగవంతంగా పరిష్కరించాలి
ABN , First Publish Date - 2022-11-02T23:26:15+05:30 IST
భూ సమస్యలను గ్రామాల్లోనే ఎప్పటికప్పుడు రెవెన్యూ అధికారులు పరిష్కరించాలని బద్వేలు రెవెన్యూ డివిజన్ అధికారి ఆకుల వెంకటరమణ పేర్కొన్నారు.
బ్రహ్మంగారిమఠం, నవంబరు 2 : భూ సమస్యలను గ్రామాల్లోనే ఎప్పటికప్పుడు రెవెన్యూ అధికారులు పరిష్కరించాలని బద్వేలు రెవెన్యూ డివిజన్ అధికారి ఆకుల వెంకటరమణ పేర్కొన్నారు. బుధవారం బ్రహ్మంగారిమఠం తహసీల్దారు కార్యాలయంలో వీఆర్వోలు, సర్వేయర్లతో ఆయన సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా సమావేశంలో ఆర్డీవో మాట్లాడుతూ గతంలో భూపట్టాలు మంజూరు చేసి ఇప్పటి వరకు భూములను చూపించలేదని వాటిని కూడా సర్వేయర్లు రీసర్వే చేసి కచ్చితంగా అర్హత కలిగిన లబ్ధిదారులకు భూములు చూపించాలని ఆయన పేర్కొన్నారు. అలాగే మండలంలో రెవెన్యూ అధికారులు సమయానికి తమ విధులు నిర్వహిస్తూ గ్రామ సచివాలయాల్లో భూ సమస్యలపై వచ్చే ఫిర్యాదులను పరిష్కరించాలని ఆయన కోరారు. అనంతరం తహసీల్దారు కార్యాలయంలో గ్రీవెన్స్ డే కావడంతో ఆర్డీవోకు భూ సమస్యలపై ప్రజలు వినతిపత్రాలు అందించారు.
తహసీల్దారు కార్యాలయాన్ని తనిఖీ చేసిన స్పెషల్ ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాసరాజు
బ్రహ్మంగారిమఠం తహసీల్దారు కార్యాలయాన్ని స్పెషల్ ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాసరాజు బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రజలకు రెవెన్యూ పరంగా అందజేసే అంశాలపై స్థానిక ఇన్ఛార్జ్ తహసీల్దారు రమే్షరెడ్డి ట్రైనీ డిప్యూటీ కలెక్టరుకు వివరించారు. అనంతరం ఆయన రెవెన్యూ అధికారుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వెంగమునిరెడ్డి, తహసీల్దారు రమే్షరెడ్డి, ఆర్ఐలు, సర్వేయర్లు, వీఆర్వోలు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.