మనస్సాక్షిని చంపుకొని పని చేస్తున్నారు

ABN , First Publish Date - 2022-08-02T05:19:17+05:30 IST

పాలక పక్షంలోని ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వంలో ఉన్న కార్యనిర్వాహక అధికారులు తమ మనస్సాక్షిని చంపుకొని పని చేస్తున్నారని, ఈ నెల 30న నంద్యాలలో జరిగిన సాగు నీటి సలహా మండలి సమావేశమే ఇందుకు నిదర్శనమని రాయలసీమ సాగు నీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి అన్నారు.

మనస్సాక్షిని చంపుకొని పని చేస్తున్నారు

అధికార పార్టీ నాయకులు, అధికారుల తీరుకు ఐఏబీ సమావేశం నిదర్శనం
సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి


నంద్యాల టౌన్‌, ఆగస్టు 1 : పాలక పక్షంలోని ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వంలో ఉన్న కార్యనిర్వాహక అధికారులు తమ మనస్సాక్షిని చంపుకొని పని చేస్తున్నారని, ఈ నెల 30న నంద్యాలలో జరిగిన సాగు నీటి సలహా మండలి సమావేశమే ఇందుకు నిదర్శనమని రాయలసీమ సాగు నీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి అన్నారు. సోమవారం సాగు నీటి సాధన సమితి కార్యాలయంలో నిర్వహించిన ముఖ్య ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్య పద్ధతిలో అధికారంలోకి వచ్చిన నాయకులు ప్రజలకు సమాధానం చెప్పడం ఎప్పుడో మరిచిపోయాయని విమర్శించారు. సాగునీటి అంశాలపై చర్చించి సహేతుకమైన నిర్ణయాలు తీసుకోవడానికి ప్రజా ప్రతినిధులు, అధికారులతో పాటు రైతుసంఘాలను కూడా ఆహ్వానించాల్సి ఉందని అన్నారు. సమావేశానికి రైతులు, రైతుసంఘాలను ఆహ్వానించకపోవడం అటుంచి సమావేశ ఏర్పాటు గురించి కూడా పత్రికలకు కూడా సమాచారం ఇవ్వని ప్రభుత్వ తీరు తీవ్ర ఆక్షేపణీయమని విమర్శించారు. ప్రజలకు తెలియకుండా అత్యంత గోప్యంగా సమావేశాన్ని నిర్వహించడాన్ని బట్టి చూస్తే ఇది ఈ ప్రాంత సాగు నీటి సమస్యల పట్ల సమాధానం చెప్పలేక తప్పించుకొని తిరిగే ప్రయత్నమని తెలుస్తోందని అన్నారు. సలహా మండలి సమావేశంలో కేసీ కెనాల్‌, శ్రీశైలం ప్రాజెక్టు, కుందూ విస్తరణ తదితర ప్రధాన అంశాలపై ఎలాంటి చర్చ జరగకపోవడం బాధాకరమని అన్నారు. సమావేశంలో రాయలసీమ సాగునీటి సాధన సమితి నాయకులు ఏర్వ రామచంద్రారెడ్డి, నిట్టూరి సుధాకర్‌రావు, వెంకటేశ్వర నాయుడు, రమణారెడ్డి, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-02T05:19:17+05:30 IST