ఎమ్మెల్యేను నిలదీసిన మహిళా ఉద్యోగి
ABN , First Publish Date - 2022-09-10T05:37:43+05:30 IST
సీపీఎస్ రద్దుపై మాట నిలబెట్టుకోకపోతే ఎలా అని ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డిని ఓ మహిళా ఉద్యోగి నిలదీశారు.
ఆదోని అగ్రికల్చర్, సెప్టెంబరు 9: సీపీఎస్ రద్దుపై మాట నిలబెట్టుకోకపోతే ఎలా అని ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డిని ఓ మహిళా ఉద్యోగి నిలదీశారు. శుక్రవారం కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని 21వ వార్డు సాయిబాబా నగర్, హటేలి వీధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఉరుకుందమ్మ అనే ఉద్యోగిని ఇంటికి ఎమ్మెల్యే వెళ్లగా సీపీఎస్పై నిలదీశారు. పాదయాత్ర సమయంలో సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేస్తామని జగన్ చెప్పారని, అధికారంలోకి వచ్చి మూడేళ్లయినా మాటను నిలబెట్టుకోలేదన్నారు. సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ అమలు చేస్తామన్నందుకే ఓట్లు వేసి గెలిపించామని అన్నారు. ఆరోగ్య శాఖలో పని చేస్తున్న తనకు మూడేళ్ల నుంచి పర్ఫామెన్స్ అలవెన్స్ కూడా చెల్లించలేదన్నారు. ఎమ్మెల్యే సాయిప్రసాద్రెడ్డి స్పందిస్తూ సీపీఎస్ రద్దు సాధ్యం కాదని ముఖ్యమంత్రి చెప్పారు కదా.. అంతకంటే మెరుగైన పెన్షన్ ఇస్తామని సమాధానం ఇచ్చారు. అక్కడ నుంచి సుమాధురి అనే మహిళ ఇంటికి వెళ్లిన ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డిని ఇంతవరకు ఇంటి పట్టా ఇవ్వలేదని, ఇప్పటికైనా ఇవ్వాలని కోరారు.