‘ఉపాధ్యాయుల పదోన్నతులు రెగ్యులర్ ప్రాతిపదికన జరపాలి’
ABN , First Publish Date - 2022-10-09T05:09:27+05:30 IST
రాష్ట్ర విద్యాశాఖ చేపడుతున్న ఉపాధ్యాయ పదోన్నతులు రెగ్యులర్ ప్రాతిపదికన జరిపి బదిలీల షెడ్యూల్ను ప్రకటించాలని డీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గట్టు తిమ్మప్ప, పత్రికా సంపాదకులు రత్నం ఏసేపు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కర్నూలు(ఎడ్యుకేషన్), అక్టోబరు 8: రాష్ట్ర విద్యాశాఖ చేపడుతున్న ఉపాధ్యాయ పదోన్నతులు రెగ్యులర్ ప్రాతిపదికన జరిపి బదిలీల షెడ్యూల్ను ప్రకటించాలని డీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గట్టు తిమ్మప్ప, పత్రికా సంపాదకులు రత్నం ఏసేపు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం స్థానిక డీటీఎఫ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంప్యూటర్ను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయులకు సంబంధించిన పదోన్నతులను ముందుగానే ప్రకటించాలన్నారు. పదోన్నతులను పేపరు మీద ఇచ్చి స్థానాలు కేటాయించకపోవడం దురదృష్టకరమన్నారు. సీనియర్లకు అన్యాయం జరగకుండా గతం వలే బదిలీల తర్వాత పదోన్నతులు చేపడితే.. గందరగోళానికి గురయ్యే అవకాశం ఉండదన్నారు. అన్ని యజమాన్యాల ఉపాధ్యాయులు ఉమ్మడి సీనియారిటీ ఆధారంగా మండల అధికారుల పదోన్నతులు ఇవ్వాలన్నారు. ప్రతి నెల ఒకటో తేదీనే జీతాలు చెల్లించాలన్నారు. ఏపీజీఎల్ఐ, జడ్పీపీఎఫ్, మెడికల్ బిల్లుల బకాయిలు విడుదల చేయాలన్నారు. పాతపద్దతిలోనే పరీక్ష విధానం కొనసాగించాలన్నారు. అన్ని రకాల యాప్ల భారాన్ని తొలగించాలన్నారు. పాతపద్ధతిలోనే ఉపాధ్యాయులకు హాజరు వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డీటీఎఫ్ ఉపాధ్యక్షుడు తాజుద్దీన, కార్యదర్శి బీమన్న, నంద్యాల జిల్లా ఉపాధ్యక్షుడు రాఘవేంద్రరావు తదితరులు పాల్గొన్నారు.