మైనర్లు వాహనాలు నడిపితే చర్యలు తీసుకోండి

ABN , First Publish Date - 2022-10-01T05:02:11+05:30 IST

మైనర్లు వాహనాలు నడిపితే చర్యలు తీసుకోవాలని అధికారులను ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ ఆదేశించారు.

మైనర్లు వాహనాలు నడిపితే చర్యలు తీసుకోండి

  1. పెండింగ్‌ కేసులను త్వరితగతిన పరిష్కరించాలి
  2. కుటుంబ, స్థానిక తగాదాలపై ముందస్తు సమాచారం సేకరించాలి 
  3. నేర సమీక్ష సమావేశంలో ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ 

కర్నూలు, సెప్టెంబరు 30: మైనర్లు వాహనాలు నడిపితే చర్యలు తీసుకోవాలని అధికారులను ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ ఆదేశించారు. శుక్రవారం స్థానిక జిల్లా పోలీస్‌ కార్యాలయంలో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. కర్నూలు సబ్‌ డివిజన, ఆదోని, పత్తికొండ సబ్‌ డివిజనలోని గ్రేవ్‌, నానగ్రేవ్‌ తదితర కేసులను సర్కిళ్ల వారిగా సమీక్షించారు. పెండింగ్‌ కేసులు, నమోదైన కేసుల్లో నేరస్థుల అరెస్టుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసులు బాధ్యతగా పని చేసి నేరాల సంఖ్య పూర్తిగా తగ్గుముఖం పట్టేవిధంగా పని చేయాలన్నారు. వచ్చే మూడు నెలల్లో నేరాలపై ప్రత్యేక దృష్టి సారించి, నేరాల సంఖ్యను పూర్తిగా తగ్గించాలన్నారు. స్పందనకు వచ్చిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. ఆదోని, కర్నూలు పట్టణాల్లో స్వచ్ఛందంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టాలని సూచించారు. జిల్లాలో అన్ని చోట్ల రోడ్డు ప్రమాదాలు అరికట్టేందుకు చర్యలు చేపట్టాలన్నారు. మైనర్లు వాహనాలు నడపడం ద్వారా జరిగే ప్రమాదాలకు తల్లిదండ్రులే బాధ్యులవుతారన్నారు. మిస్సింగ్‌ అయిన మొబైల్స్‌ను రికవరీ చేయాలన్నారు. దిశా ఎస్‌వోఎస్‌ యాప్‌ బాగా పని చేస్తోందన్నారు. అత్యవసర సమయాల్లో వెంటనే స్పందించాలన్నారు. రాత్రి పూట గస్తీని పెంచాలని సూచించారు. సచివాలయ మహిళా పోలీసులు గ్రామాలకు వెళ్లి కుటుంబ, స్థానిక తగాదాల గురించి ముందస్తు సమాచారం సేకరించి లోకల్‌ డిస్పూట్‌ రిజిస్టర్‌లో నమోదు చేసి ఎస్‌ఐలకు తెలియజేయాలన్నారు. డీఎస్పీ ఆఫీసులో ఫ్యామిలీ కౌన్సెలింగ్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో సెబ్‌ అడిషినల్‌ ఎస్పీ కృష్ణకాంత పటేల్‌, అడిషినల్‌ ఎస్పీ అడ్మిన డి.ప్రసాద్‌, లీగల్‌ అడ్వైజర్‌ మల్లికార్జునరావు, డీఎస్పీలు వెంకటాద్రి, శ్రీనివాసులు, వినోద్‌ కుమార్‌, డీపీవో ఏవో సురేష్‌బాబు, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.


 

Updated Date - 2022-10-01T05:02:11+05:30 IST