ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ
ABN , First Publish Date - 2022-09-22T04:50:49+05:30 IST
ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు మంచి రోజులు రానున్నాయి. ఉపాధ్యాయుల కొరతతో కొట్టుమిట్టాడుతున్న పాఠశాలలకు ఇక ఈ సమస్య తీరనుంది.
ఉమ్మడి జిల్లాకు 1876 ఉపాధ్యాయ పోస్టులు మంజూరు
కర్నూలు(ఎడ్యుకేషన) సెప్టెంబరు 21: ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు మంచి రోజులు రానున్నాయి. ఉపాధ్యాయుల కొరతతో కొట్టుమిట్టాడుతున్న పాఠశాలలకు ఇక ఈ సమస్య తీరనుంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు 1876 పోస్టులు మంజూరు చేస్తూ జీవో ఎంఎస్ నెం:155ను ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ బి.రాజశేఖర్ బుధవారం జారీ చేశారు. ఇందులో 97 పాఠశాలల ప్రధానోపాధ్యాయుల పోస్టులు స్కూల్అసిస్టెంట్లు 1553, ఎస్జీటీ పోస్టులు 226 ఉన్నాయి. ఎస్ఏ గణితం పోస్టులు 293, ఎస్ఏ పిజికల్ సైన్సు 117, ఎస్ఏ బయాలజికల్ సైన్స 153, ఎస్ఏ సోషల్ స్టడీస్ 143, ఎస్ఏ ఇంగ్లీష్ 303, ఎస్ఏ తెలుగు 175, ఎస్ఏ హిందీ 163, ఎస్ఏ ఉర్దూ 11, ఎస్ఏ కన్నడ 11, ఎస్ఏ పీఈటీ 184 పోస్టులు ఉన్నాయి. రాష్ట్రంలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాలో మిగిలిపోయిన ఉపాధ్యాయ పోస్టులను కర్నూలు మళ్లించారు. కర్నూలు జిల్లాలో మ్యాపింగ్, రేషనలైజేషన చేసిన తరువాత ఉమ్మడి కర్నూలు జిల్లాకు 2450 పోస్టులు అవసరం అన్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. త్వరలో పదోన్నతులు ఇచ్చిన అనంతరం ఈ పోస్టులను డీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సర్ప్లెస్ పోస్టులు ఉండగా ఒక్క కర్నూలు జిల్లాలోనే ఉపాధ్యాయుల కొరత ఉంది. విద్యాశాఖ దీనిని దృష్టిలో ఉంచుకొని ఉమ్మడి కర్నూలు జిల్లాకు కొత్తగా 1876 పోస్టులను మంజూరు చేసింది. ఉపాధ్యాయ పోస్టులు మంజూరు చేయడం పట్ల ఉపాధ్యాయ సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు.