ఆస్పత్రిలో మధ్యాహ్న భోజనం ఆలస్యం
ABN , First Publish Date - 2022-06-07T06:54:46+05:30 IST
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో సోమవారం మధ్యాహ్నం భోజనం ఆలస్యం కావడంతో రోగులు ఆకలితో అలమటించారు.
ఆకలితో అలమటించిన రోగులు
కర్నూలు(హాస్పిటల్), జూన్ 6 : కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో సోమవారం మధ్యాహ్నం భోజనం ఆలస్యం కావడంతో రోగులు ఆకలితో అలమటించారు. డైట్ విభాగంలో పని చేసే సిబ్బందికి రెండు నెలల నుంచి జీతాలు రాకపోవడంతో మధ్యాహ్న భోజనం బండ్లను వార్డుల దగ్గరకు తీసుకుపోకుండా నిరసన తెలిపారు. జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నామని, ఇస్తేగానీ రోగులకు డైట్ను పంపిణీ చేస్తామని భీష్మించారు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లగా పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో సిబ్బంది బోజనాన్ని రోగులకు అందించారు. 12.30 గంటలకు రోగులకు అందించాల్సిన భోజనం 2 గంటలకు ఇచ్చారు. చిన్నారులు, టీబీ రోగులు ఆకలితో అల్లాడిపోయారు.