AP News: కర్నూలు జిల్లాలో భారీ వర్షాలు.. వాగు దాటుతుండగా వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2022-08-02T18:19:33+05:30 IST

ఉమ్మడి కర్నూలు జిల్లాలో భారీ వర్షాలు (Heavy rains) కురుస్తున్నాయి. అర్ధరాత్రి నుంచి...

AP News: కర్నూలు జిల్లాలో భారీ వర్షాలు.. వాగు దాటుతుండగా వ్యక్తి మృతి

కర్నూలు (Kurnool): ఉమ్మడి కర్నూలు జిల్లాలో భారీ వర్షాలు (Heavy rains) కురుస్తున్నాయి. అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వందల ఎకరాలలో పంట నీట మునిగింది. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లల్లోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జూపాడు బంగ్లా మండలం, పారుమంచాయిలో ఇసుకవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జూపాడుబంగ్లా పోలీస్ స్టేషన్ ఆవరణ జలమయమైంది. దీంతో పోలీసు సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.


నందికొట్కూరు, మారాతీనగర్‌లో వరదనీరు ఇళ్లల్లోకి చేరింది. దీంతో కాలనీ వాసులు ఇబ్బందులు పడుతున్నారు. బ్రాహ్మణకొట్కూరులో కురిసిన వర్షాలకు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. వందల ఎకరాలలో పంట నీటమునిగింది. కల్లూరు మండలంలో నెలవాడ దగ్గర వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగు దాటుతుండగా ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. నెరవాడ గ్రామానికి చెందిన మద్దిలేటి అనే వ్యక్తి మరో నలుగురు కలిసి వాగు దాటి కర్నూలుకు వెళ్లే ప్రయత్నం చేశారు. మధ్యలోకి వచ్చేసరికి మద్దిలేటి అనే వ్యక్తి బ్యాలెన్స్ తప్పి నీళ్లలో పడిపోయాడు. అయితే మిగిలిన నలుగురు అతనిని కాపాడే ప్రయత్నం చేశారు. అప్పటికే ఆయన వాగులో కొట్టుకుపోయాడు. కిలోమీటరు దూరంలో మద్దిలేటి శవమై తేలాడు. స్థానికులు మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2022-08-02T18:19:33+05:30 IST