పశ్చిమ ప్రాంత అభివృద్ధికి నివేదికలు రూపొందించండి: కలెక్టర్
ABN , First Publish Date - 2022-03-17T05:17:44+05:30 IST
జిల్లాలోని పశ్చిమ ప్రాంత అభివృద్ధి కోసం నివేదికలు రూపొందించాలని కలెక్టర్ కోటేశ్వరరావు అధికారులకు సూచించారు.
కర్నూలు(కలెక్టరేట్), మార్చి 16: జిల్లాలోని పశ్చిమ ప్రాంత అభివృద్ధి కోసం నివేదికలు రూపొందించాలని కలెక్టర్ కోటేశ్వరరావు అధికారులకు సూచించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ భవనంలో బుధవారం ఆదోని ఏరియా డెవలప్మెంట్ అథారిటీపై సామాజిక ఆర్థిక పరిస్థితుల బృందం, సంబంధిత జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ అత్యంత వెనుకబడిన ప్రాంతమైన ఆదోని డివిజన్ను అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆదోని ఏరియా డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేసి ఐఏఎస్ అధికారిని స్పెషల్ కలెక్టర్గా నియమించిందని తెలిపారు. ఇందుకు సంబంధించి తమ తమ శాఖల్లో అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఇంకా అదనంగా ఏం చేస్తే వెనుకబాటుతనం నుంచి విముక్తి కలుగుతుందో స్థిరమైన, ఉన్నతమైన ఆలోచనలతో సమగ్ర నివేదికలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. జేసీలు మనజీర్ జిలానీ సామూన్, ఎంకేవీ శ్రీనివాసులు, డీఆర్వో పుల్లయ్య, సెస్ ప్రొఫెసర్ లక్ష్మణరావు, డ్వామా పీడీ అమర్నాథ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ, ఆలూరు, మంత్రాలయం నియోజకవర్గాలలో జీవనోపాధి నిమిత్తం పేద ప్రజలు వలస బాట పట్టడం, కరువు కాటకాలతో పంటలు సరిగా పండక పోవడం, తాగునీరు, ఇతర మౌలిక వసతులు లేకపోవడం తదితర కారణాల వల్ల ఆదోని డివిజన్ అత్యంత వెనుకబడి ఉందన్నారు. వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలు, పరిశ్రమలు, ఇరిగేషన్ తదితర అన్ని శాఖలు వెనుకబాటు తనానికి ఉన్న కారణాలను అన్వేషించి వాటిని అధిగమించేందుకు తీసుకోవలసిన చర్యలపై నివేదికలు తయారు చేయాలన్నారు. ఇందుకు సంబంధించి సామాజిక ఆర్థిక పరిస్థితుల సర్వే బృందం కొంత వరకు డెటాను సేకరించిందని అభివృద్ధి ప్రణాళికపై సంబంధిత బృంద సభ్యులు కోరినప్పుడు తక్షణమే స్పందించి తయారు చేసిన నివేదికలను ఇవ్వడంతో పాటు సంబంధిత అధికారులకు సహకరించాలని ఆదేశించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మూలాలను అన్వేషించి, అక్కడి నుంచి అభివృద్దికి బాటలు వేసుకుంటూ.. అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకుంటూ వినూత్నమైన ఆలోచనలతో సైంటిఫిక్గా ముందుకు వెళ్లాలని కలెక్టర్ సూచించారు. జేసీ(అభివృద్ధి)మనజీర్ జిలానీ సామూన్ మాట్లాడుతూ కన్వర్జెన్స్ మోడ్ను దృష్టిలో పెట్టుకొని అడ్వాన్స్డు ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని సూచించారు. సమావేశంలో జడ్పీ సీఈవో వెంకటసుబ్బయ్య, డీఆర్డీఏ పీడీ వెంకటేశులు, డీపీవో నాగరాజునాయుడు, పరిశ్రమలశాఖ జీఎం సోమశేఖర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.