మూడేళ్లలో నలుగురు

ABN , First Publish Date - 2022-09-20T05:05:43+05:30 IST

వైసీపీ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో నందికొట్కూరులో నలుగురు మున్సిపల్‌ కమిషనర్లు మారారు.

మూడేళ్లలో నలుగురు

 కమిషనర్‌ పదవితో ఆడుకుంటున్న వైసీపీ ప్రజా ప్రతినిధులు
నాలుగో మున్సిపల్‌ కమిషనర్‌గా తిరిగి కిషోర్‌
ఈసారైనా నిలబడేనా..?


నందికొట్కూరు, సెప్టెంబరు 19: వైసీపీ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో నందికొట్కూరులో నలుగురు మున్సిపల్‌ కమిషనర్లు మారారు. ఇద్దరు ప్రజాప్రతినిధుల మధ్య పోరులో నియోజకవర్గంలోని అధికారులకు బదిలీలు తప్పడం లేదు. దీని వల్ల నందికొట్కూరుకు అధికారులు రావాలంటేనే ఆలోచించే పరిస్థితి ఏర్పడింది. ఈ ఇద్దరు నాయకుల ఆధిపత్య పోరులో అధికారులు నలిగిపోతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇప్పటికే ముగ్గురు టౌన్‌ సీఐలు మారారు. మున్సిపల్‌ కమిష నర్లు నలుగురు మారారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త, శాప్‌ చైర్మన్‌ బైరెడ్డి సిద్దార్థరెడ్డి మద్దతుతో కిషోర్‌ మున్సిపల్‌ కమిషనర్‌గా 20 రోజులు విధులు నిర్వహించారు. ఆ తర్వాత బదిలీ అయ్యారు. ఎమ్మెల్యే ఆర్థర్‌కు ఆయన నచ్చకపోవడమే కారణం అనే ఆరోపణలు వినిపించాయి. ఆయన స్థానంలో ఎమ్మెల్యే మద్దతుతో అంకిరెడ్డి మున్సిపల్‌ కమిషనర్‌ అయ్యారు. ఆయన రెండున్నరేళ్లపాటు విధులు నిర్వహించారు. ఆయనకు ఆర్థిక శాఖ మంత్రి మద్దతు ఉండటం వల్లే ఇది సాధ్యమైందని మున్సిపాల్టీలోని ఉద్యోగుల  మధ్య చర్చ జరిగింది. అనంతరం బైరెడ్డి సిద్ధార్థరెడ్డి మద్దతులో వచ్చిన మధుసూదన్‌రెడ్డి ఏడు నెలలు మాత్రమే విధులు నిర్వహించారు. ఆయన తీరు ఎమ్మెల్యేకు నచ్చకపోవడంతో బదిలీ అయ్యారు. ఆ స్థానంలో నందికొట్కూరు మున్సిపాలిటీలో మేనేజర్‌గా పని చేస్తున్న బేబి ఎమ్మెల్యే మద్దతుతో కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆమెకు జూన్‌ 30న కమిషనర్‌గా ఉత్తర్వులు అందాయి. జూలై 5న కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. తాజాగా సెప్టెంబరు 15న కిషోర్‌ను కమిషనర్‌గా నియమిస్తూ జీవో నెం: 690ను ప్రభుత్వం విడుదల చేసింది. అయితే కిషోర్‌ ఆర్డర్‌ను రద్దు చేసి బేబినే కొనసాగించాలని ఎమ్మెల్యే... కిషోర్‌నే తీసుకు రావాలని సిద్ధార్థరెడ్డి వర్గీయులు ఐదు రోజులుగా విజయవాడలో తిష్ట వేసినట్లు సమాచారం. బేబీ కమిషనర్‌ బాధ్యతల నుంచి రిలీవ్‌ కావాలంటూ రాష్ట్ర మున్సిపాలిటీ పరిపాలన శాఖ నుంచి  సోమవారం నందికొట్కూరు మున్సిపాల్టీకి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆమె స్థానంలో తిరిగి కిషోర్‌ కమిషనర్‌గా రానున్నారు. రాయదుర్గం నుంచి నందికొట్కూరుకు డిప్యుటేన్‌పై మూడు సంవత్సరాలు, రెగ్యులర్‌ మేనేజర్‌గా మూడు సంవత్సరాలు బేబి పని చేశారు. 70 రోజులపాటు కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహించారు. నేడో, రేపో కొత్త కమిషనర్‌గా కిషోర్‌ బాధ్యతలు చేపట్టే అవకాశం కనిపిస్తోంది. ఈ రెండు వర్గాల మధ్య ఆయన రెండోసారి ఎన్ని రోజులు విధుల్లో ఉంటారో వేచి చూడాల్సిందే.

Updated Date - 2022-09-20T05:05:43+05:30 IST