భయం గుప్పెట్లో బల్లేకల్‌

ABN , First Publish Date - 2022-02-23T05:41:28+05:30 IST

పెద్దపులి ఏకంగా ఆదోని మండలం బల్లేకల్‌ గ్రామంలోకి వచ్చింది.

భయం గుప్పెట్లో బల్లేకల్‌

నాలుగు పొటేళ్లను చంపేసిన చిరుతపులి

ఆదోని, ఫిబ్రవరి 22: పెద్దపులి ఏకంగా ఆదోని మండలం బల్లేకల్‌ గ్రామంలోకి వచ్చింది. నాలుగు పొట్టేళ్లను చంపి తినేసింది. ఇదంతా తాయప్ప అనే వ్యక్తి కళ్లముందే జరిగింది. అప్పటి నుంచి ఊరంతా భయం గుప్పెట్లో ఉంది. కొద్ది రోజులుగా కొండపైన చిరుతపులి కనిపిస్తున్నదని గ్రామస్థులు ఫారెస్ట్‌ అధికారులకు సమాచారం అందించినా చర్యలు తీసుకోలేదు.  సోమవారం అర్ధరాత్రి 1 గంట పైన గాలిదేవుడి తాయప్ప ఇంటి ఆవరణలోకి చిరుతపులి వచ్చింది. మంచంపై నిద్రిస్తున్న తాయప్ప శబ్దానికి కళ్లు తెరిచి చూశాడు. ఎదుట చిరుతపులి కనిపించింది. భయంతో ఏం చేయాలో దిక్కుతోచక మంచంపై కదలకుండానే చూస్తూ ఉండిపోయారు. పులి రూ.60 వేలు విలువ చేసే నాలుగు పొటేళ్లను చంపి తినేసింది. ఒక్కసారిగా తాయప్ప ఇంట్లోకి పరుగులెత్తి తలుపేసుకున్నాడు. గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు రావడంతో చిరుతపులి అక్కడి నుండి కొండలోకి పరారైంది.  ఎవరిపైనా దాడి చేయకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. మంగళవారం సాయంత్రం నుంచే గ్రామంలోని యువకులు కర్రలు పట్టుకుని ఊరంతా తిరుగుతూ ఉన్నారు. అది ఏ అర్ధరాత్రి వచ్చి గ్రామం మీద పడి ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడుతుందోనని గ్రామస్థులు బిక్కుబిక్కుమంటూ నిద్రపోకుండా ఉండిపోయారు. ఫారెస్ట్‌ అధికారులు స్పందించి ఉంటే ఇలాంటి ఇబ్బంది కలిగి ఉండేది కాదని, వారి నిర్లక్ష్యం వల్ల  రూ.60 వేలు విలువ చేసే పొట్టేళ్లు చనిపోయాయని తాయప్ప వాపోయారు.  ఇప్పటికైనా ఫారెస్ట్‌ అధికారులు స్పందించి చిరుతపులిని పట్టుకుని ఫారెస్ట్‌కు తరలించాలని గ్రామస్థులు తెలుపుతున్నారు.

Updated Date - 2022-02-23T05:41:28+05:30 IST