విద్యా దార్శనికుడు అబుల్ కలాం ఆజాద్: కలెక్టర్
ABN , First Publish Date - 2022-11-11T22:31:50+05:30 IST
దేశంలో విద్యాభివృద్ధికి ఎనలేని కృషి చేసిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ విద్యా దార్శనికుడు అని కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్ కొనియాడారు.
నంద్యాల (నూనెపల్లె), నవం బరు 11: దేశంలో విద్యాభివృద్ధికి ఎనలేని కృషి చేసిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ విద్యా దార్శనికుడు అని కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్ కొనియాడారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ 134వ జయంతి వేడుకలను పురస్కరించుకొని జాతీయ విద్యా దినోత్సవం, రాష్ట్ర మైనార్టీ సంక్షేమ దినోత్సవాన్ని కలెక్టరేట్లోని సెంటినరీ హాల్లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కలెక్టర్తో పాటు ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ గంగుల ప్రభాకర్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మాబున్నీసా, డీఈవో అనూరాధ, రాష్ట్ర ఉర్దూ అకాడమీ మాజీ చైర్మన్ నౌమాన్, మైనార్టీ నాయకులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. భారతదేశ తొలి కేంద్ర విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు తమ పిల్లలను చదివించుకోవాలని సూచించారు. జిల్లాలో మైనార్టీల అక్షరాస్యత శాతం చాలా తక్కువగా ఉందన్నారు. పిల్లలను పాఠశాలలకు పంపకుండా పనులకు పంపిస్తున్నారని, ఇది చట్టరీత్యా నేరమని అన్నారు. వివిధ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.