నేరేడు పండ్లు తిని...
ABN , First Publish Date - 2022-06-12T05:40:33+05:30 IST
ఓ చిన్న అవగాహన లోపం... నలుగురి ప్రాణాల మీదికి తెచ్చింది.
మూడేళ్ల బాలుడు మృతి
తల్లి, మరో ఇద్దరు పిల్లల పరిస్థితి విషమం
క్రిమిసంహారక మందుల కవర్లో పండ్లు తేవడమే కారణం?
కోసిగి, జూన్ 11: ఓ చిన్న అవగాహన లోపం... నలుగురి ప్రాణాల మీదికి తెచ్చింది. వీరిలో ఒక చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. పొలాల గట్టున, బీడు నేలల్లో నేరేడు పండ్లు విరగ్గాస్తాయి. అలాంటి నేరేడు పండ్లను ఓ మహిళ పొలం పక్కన కనిపించిన ఓ కవర్లో వేసుకొని ఇంటికి తీసుకొచ్చింది. వాటిని తిన్న తరువాత నలుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆరోగ్య ప్రదాయిని అయిన నేరేడు వల్ల ఎలాంటి ప్రమాదం జరిగే అవకాశం లేదు. పండ్లు తీసుకొచ్చిన కవర్ క్రిమిసంహారక మందులకు సంబంధించినది కావడం వల్లే ఇలా జరిగిందని చివరికి గుర్తించారు. ఈ ఘటన శనివారం కోసిగిలో చోటుచేసుకుంది. కోసిగిలోని 3వ వార్డుకు చెందిన మాదేవి తన కుమారులు హర్ష, అంజిలతో పాటు తన బావ వీరారెడ్డి కుమారుడు శ్రీరాములుకు.. పొలం నుంచి తీసుకువచ్చిన నేరేడు పండ్లను ఇచ్చింది. తనూ తిన్నది. ఆ తర్వాత గంట సేపటికే వారికి కళ్లు తిరిగి నోట్లో నుంచి నురగలు రావడం మొదలైంది. కుటుంబ సభ్యులు వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిలో మాదేవి కుమారుడు హర్ష(3) పరిస్థితి విషమం కావడంతో ఆక్సిజన్ అందించారు. అయితే ఆస్పత్రిలో డాక్టరు లేకపోవడంతో స్టాఫ్నర్సులు వైద్యం చేశారు. అక్కడి నుంచి ఆదోనికి తరలించేందుకు 108 అంబులెన్సు వాహనం లేకపోవడంతో గంటపాటు ఇబ్బందిపడాల్సి వచ్చింది. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు, కాలనీవాసులు ప్రభుత్వ ఆసుపత్రి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరికి ఓ ప్రైవేటు వాహనంలో ఆదోనికి బాధితులను తరలిస్తుండగా.. మార్గమధ్యలోనే హర్ష మృతి చెందాడు. మాదేవి, ఆమె కుమారుడు అంజి, వీరారెడ్డి కుమారుడు శ్రీరాములును ఆదోనిలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వీరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పొలంలో దొరికిన నేరేడు పండ్లను అక్కడ పడి ఉన్న క్రిమిసంహారక మందుల కవర్లో వేసుకొని రావడం వల్ల ఈ పరిస్థితి తలెత్తినట్టు భావిస్తున్నారు. ఈ ఘటనతో కోసిగిలోని 3వ వార్డులో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఔట్పోస్టు పోలీసులు కేసు నమోదు చేసుకున్నట్లు తెలిపారు.