మంత్రాలయానికి పోటెత్తిన భక్తులు

ABN , First Publish Date - 2022-04-25T04:44:50+05:30 IST

రాఘవేంద్రస్వామి దర్శనార్థం ఆదివారం ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు.

మంత్రాలయానికి పోటెత్తిన భక్తులు

మంత్రాలయం, ఏప్రిల్‌ 24: రాఘవేంద్రస్వామి దర్శనార్థం ఆదివారం ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. నదీతీరం ప్రధాన రహదారులు, మఠం ప్రాంగణం, మహా ముఖద్వారం భక్తులతో కిటకిటలాడాయి. రాఘవేంద్రస్వామి దర్శనార్థం క్యూలైన్లన్నీ నిండిపోయాయి. అన్నపూర్ణ భోజనశాల భక్తులతో సందడిగా మారింది. శ్రీమఠం అతిథి గృహాలు, ప్రైవేటు లాడ్జీలు నిండిపోయాయి. రాఘవేంద్రస్వామి దర్శనార్థం వచ్చిన భక్తులు మహా ముఖద్వారం వద్దే పాదరక్షలు వదిలారు. దయచేసి ఇక్కడ చెప్పులు వదలరాదు.. అని బోర్డులు ఉన్న చోటనే వందలాది మంది చెప్పులు వదిలారు. పోలీసు అధికారులు, సెక్యూరిటీ చూస్తుండిపోయారుగాని చర్యలు తీసుకోలేదనే విమర్శలు వినిపించాయి. 


రమణీయంగా రజిత గజ వాహనోత్సవం 


వేద పండితుల మంత్రోచ్ఛరణాలు, మంగళవాయిద్యాల మధ్య రజిత గజవాహనోత్సవం వైభవంగా జరిగింది. ఆదివారం చైత్ర నవమిని పురస్కరించుకుని పీఠాధిపతి సుబుధీంద్రతీర్థుల ఆధ్వర్యంలో గజ వాహనోత్సవం వైభవంగా జరిగింది. ప్రహ్లాదరాయలను బంగారు పట్టువస్త్రాలు, గులాబి పుష్పాలు, వజ్రాలతో పొదిగిన స్వామివారిని వెండి గజవాహనం మీద బంగారు అంబారిపై అధిష్టించి ఆలయ ప్రాంగణం చుట్టూ ఊరేగించారు. 

Updated Date - 2022-04-25T04:44:50+05:30 IST